Wednesday, October 16, 2024

TG – క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించండి… క‌లెక్ట‌ర్లతో రేవంత్

ఆంధ్ర‌ప‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – కలెక్టర్లు క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందే అని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో నేడు జ‌రుగుతున్న‌ కలెక్టర్ల సదస్సులో ఆయ‌న మాట్లాడుతూ, ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని ఆ సమావేశంలో ఆదేశించామని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీలు నిర్వహించామని అన్నారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే అని తెలిపారు. కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారు ఉన్నారని తెలిపారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారన్నారు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని సీఎం తెలిపారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలని తెలిపారు. ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా మీరు పనిచేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోవాలన్నారు.

కేవలం ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా ఎలాంటి సంతృప్తి ఉండదన్నారు. మీ ప్రతీ చర్య ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు. ఈ ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలన్నారు. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపైనే ఉందని తెలిపారు. కలెక్టర్లు క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందే అని ఆదేశించారు.

- Advertisement -

ప్రతీ పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతీ నెలా రూ.85వేలు ఖర్చు పెడుతోందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకమని తెలిపారు. విద్యావ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని తెలిపారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే.. విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిలా స్పందించారన్నారు. కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా మీ పనితనం ఉండాలని సీఎం తెలిపారు. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీపైనే ఉందన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement