Friday, September 13, 2024

TG – చినుకు పడిన క్షణం నుంచి ప్రజల్లోనే ఉన్నాం … కేసీఆర్ లా ఫార్మ్ హౌస్ లో కూర్చోలా …. మంత్రి పొంగులేటి

మా ముందస్తు చర్యల వల్ల వీలైనంత ప్రాణ నష్టం తగ్గించగలిగాం
పదేండ్లలో డిజాస్టర్ మేనేజ్మెంట్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు
విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు
ప్రజల రక్షణే మాకు ముఖ్యం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాదు : ఆనాడు 2022 లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చిన భారీ వర్షాలు, వరదలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి వర్షాలు క్లౌడ్-బరస్ట్, విదేశి కుట్ర అంటూ మతిలేని ప్రకటనలు చేసిన బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత ఎక్కడిదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. విదేశీ కుట్ర అని ఫార్మ్ హౌస్ దాటని బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఈరోజు వరదల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఆనాడు ప్రకృతిపరంగా కురిసిన వర్షాలను కూడా కుట్రకోణంలో చూసిన ఆ పెద్దమనిషి, ఆ దొరవారి అల్లుడు హరీష్ రావు కూడా ఇప్పుడు వచ్చిన వర్షాలను కుట్ర కోణంలోనే చూస్తున్నారా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

వరదలపై మంగళవారం ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను పొంగులేటి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.

- Advertisement -

“వరదల్లో కారు కొట్టుకుపోయి చనిపోయిన సైంటిస్టు నునావత్ అశ్విని కుటుంబాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి క్యాబినెట్ సహచర మంత్రులం పరామర్శించి, భరోసా కల్పించాం. కనీసం చనిపోయిన కుటుంబాలను పరామర్శించాలన్న సోయి కూడా బీఆర్ఎస్ పెద్దలకు లేకపోవడం దురదృష్టకరం.

జైలు నుండి వచ్చిన బిడ్డను ఆశీర్వదించడానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ కు సమయం ఉంటుంది కానీ, వరద కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించడానికి గడప దాటడం లేదు. పదేండ్ల పాలన అనుభవంతో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఒక సలహానైనా సూచననైనా చేస్తారని భావించామని, కానీ ఆయన పెదవి కూడా విప్పకపోవడం దురదృష్టకరం. ఇంకా ఆయన కుమారుడు కేటీఆర్ అమెరికాలో ఉండి, ఇక్కడ ఏమి జరుగుతుందో తెలియకుండా, అజ్ఞానంతో ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయన ఎందుకు అమెరికా వదిలి రావడం లేదు ? అధికార పార్టీని తిట్టడమే ప్రతిపక్ష పార్టీ పని అన్నట్టుగా మా మీద దాడి చేస్తున్నారు. ఓటు వేసిన వేలుకు సిరా చుక్క కూడా తొలిగిపోయిందో లేదో అప్పటినుంచే దాడి మొదలుపెట్టారు. పది సంవత్సరాలలో విపత్తుల నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఒక్క నాడైనా ప్రకృతి విపత్తులమీద సమావేశం నిర్వహించారా ? దాన్ని బలోపేతం చేయాలన్న ఆలోచన చేశారా ? దాన్ని బలోపేతం చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? కొంతలో కొంతైనా ముప్పు తగ్గేది కదా !

రాష్ట్రంలో, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా ఆకాశం నుంచి నీళ్ళు గుమ్మరించినట్టుగా, తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో ఊహించని నష్టం వాటిల్లింది. అయినప్పటికీ ప్రభుత్వం ముందుజాగ్రత్తగా తీసుకున్న చర్యలు, వర్షం అనంతరం ప్రజలను రక్షించడంలో, వారికి కావలసిన వసతులు కల్పించి ఆదుకోవడంలో చూపిన చొరవ, అందించిన సహాయ సహకారాల కారణంగా అపారనష్టాన్ని తగ్గించగాలిగాం.

ముఖ్యంగా ఖమ్మంజిల్లాకు సంబంధించి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అందరం కలిసి సమన్వయంతో పని చేయడం వల్లే ప్రాణ నష్టాన్ని, కనిష్ట స్థాయికి తగ్గించగలిగాం. ప్రజలను ఆదుకోవడానికి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, కోడి పిల్లలను కాపాడినట్టు జిల్లా ప్రజలను రక్షిస్తూ వచ్చాం. మరోవంక ముఖ్యమంత్రి కూడా స్వయంగా ఖమ్మం జిల్లాలో పర్యటించి, పరిస్థితిని పూర్తిస్థాయిలో అంచనా వేసేందుకు అక్కడే రాత్రిపూట బసచేసి మరీ ప్రజలను ఆదుకున్నారు. ప్రజలకు తక్షణావసరాలను అందించారు.

గతంలో ఖమ్మం జిల్లాలో వరదలు వస్తే పదివేలు చొప్పున సహాయం చేస్తామని చెప్పి చేతులెత్తేసినవారు ఇప్పుడు యాభై వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడం విచిత్రంగా ఉంది. ఇదంతా ఇంకా ప్రజలు మరచిపోలేదు. బీఆర్ఎస్ బురద రాయకీయాలను మేము పట్టించుకోవడం లేదు. మాకు ప్రజలు ముఖ్యం. వారి రక్షణ ముఖ్యం. రాష్ట్రంలో చివరి బాధితుడికి కూడా ప్రభుత్వ సహాయం అందేటట్టు చూడటమే మాధ్యేయం” అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement