Sunday, September 29, 2024

TG – మెట్రో రైల్ రెండో దశ డీపీఆర్‌లకు తుదిమెరుగులు

హైదరాబాద్ – మెట్రో రైల్ రెండో దశ డీపీఆర్‌ల (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్) తయారీ పురోగతిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ సీనియర్ అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మెట్రో రెండవ దశ కారిడార్‌ల అలైన్‌మెంట్, ముఖ్యమైన ఫీచర్లు, స్టేషన్ లు మొదలైనవాటిపై సవివరమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు.

అన్ని కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్‌లకు తుది మెరుగులు దిద్దుతున్నామని, ట్రాఫిక్ అంచనాల విషయంలో హెచ్‌ఎండీఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాకి సిద్ధం చేస్తున్న కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ) ట్రాఫిక్ అధ్యయన నివేదిక కోసం హెచ్‌ఏఎంఎల్ ఎదురుచూస్తోందని ఎండీ ముఖ్యమంత్రికి తెలియజేశారు.

- Advertisement -

మెట్రో మార్గాలలో ట్రాఫిక్ అంచనాలను సీఎంపీతో క్రాస్-చెక్ చేయాల్సి ఉంటుంది. రెండవ దశ మెట్రో కారిడార్‌ల కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం డీపీఆర్‌లను సమర్పించడానికి ఇది తప్పనిసరి. గతంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించిన ప్రకారం, ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్ ఇప్పుడు ఆరామ్‌ఘర్, 44వ నెంబర్ జాతీయ రహదారి(బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఖరారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

వివిధ ప్రత్యామ్నాయాల గురించి లోతైన చర్చల తర్వాత, ముఖ్యమంత్రి మెట్రో రెండో దశ కారిడార్‌ల విస్తృత కాంటూర్ లను ఆమోదించారు,

అవి క్రింది విధంగా ఉన్నాయి:

కారిడార్ IV: నాగోల్ -RGIA (ఎయిర్ పోర్ట్ కారిడార్) 36.6 కి.మీ

కారిడార్ V : రాయదుర్గ్ -కోకాపేట్ నియోపోలిస్ 11.6 కి.మీకారిడార్

VI: ఎంజీబీఎస్ – చంద్రాయన్ గుట్ట (ఓల్డ్ సిటీ కారిడార్) 7.5 కి.మీకారిడార్

VII: మియాపూర్ – పటాన్ చెరు 13.4 కి.మీకారిడార్

VIII: ఎల్ బి నగర్ – హయత్ నగర్ 7.1 కి.మీ

కారిడార్ IX : RGIA – ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ) 40 కి.మీ

మొత్తం 116.2 కి.మీ.

కారిడార్ IV (ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్) నాగోల్ నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు దాదాపు 36.6 కి.మీ పొడవును కవర్ చేస్తుంది.

ఎల్ బి నగర్, కర్మన్‌ఘాట్, ఒవైసీ హాస్పిటల్, డిఆర్ డిఓ, చంద్రాయన్ గుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరంఘర్, న్యూ హైకోర్టు, శంషాబాద్ జంక్షన్ ద్వారా NH మీదుగా ఈ మార్గం ఉంటుంది.

ఈ ఎయిర్‌పోర్ట్ లైన్ వరుసగా నాగోల్, ఎల్‌బి నగర్, చంద్రాయన్ గుట్ట వద్ద ఉన్న అన్ని మెట్రో లైన్‌లకు అనుసంధానించబడుతుంది.మొత్తం 36.6 కి.మీ పొడవులో, 35 కి.మీ ఎలివేట్ చేయబడుతుంది, అలాగే 1.6 కి.మీ మార్గం భూగర్భంలో వెళ్తుంది.

ఈ మార్గంలో భూగర్భ స్టేషన్ అయిన ఎయిర్ పోర్ట్ స్టేషన్ తో సహా మొత్తం 24 మెట్రో స్టేషన్లు ఉంటాయి

కారిడార్ V రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుండి కోకాపేట్ నియోపోలిస్ వరకు బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ నియోపోలిస్ మీదుగా బ్లూ లైన్ పొడిగింపుగా నిర్మించబడుతుంది.

ఇది మొత్తం ఎలివేటెడ్ కారిడార్. ఇందులో దాదాపు 8 స్టేషన్లు ఉంటాయి.

కారిడార్ VI (ఓల్డ్ సిటీ మెట్రో) ఎంజీబీఎస్ నుండి చంద్రాయన్ గుట్ట వరకు గ్రీన్ లైన్ పొడిగింపుగా నిర్మించబడుతుంది.

ఎంజీబీఎస్ నుండి ఈ 7.5 కి.మీ లైన్, ఓల్డ్ సిటీలోని మండి రోడ్ మీదుగా దారుల్‌షిఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్‌నుమా మీదుగా ప్రయాణిస్తుంది. కారిడార్ సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్ నుండి 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ఈ పేర్లనే వాటి చారిత్రక ప్రాముఖ్యత కారణంగా స్టేషన్ పేర్లుగా ఉంచడం జరుగుతుంది.

ప్రస్తుతం దారుల్‌షిఫా జంక్షన్ నుండి శాలిబండ జంక్షన్ మధ్య 60 అడుగుల రోడ్డు; శాలిబండ జంక్షన్ నుండి చంద్రాయన్ గుట్ట వరకు 80 అడుగుల రోడ్డు ఏకరీతిగా 100 అడుగులకు విస్తరించడం జరుగుతుంది. స్టేషన్ ఉండే ప్రాంతాలలో మాత్రం రోడ్డును 120 అడుగులకు విస్తరించడం జరుగుతుంది.రోడ్డు విస్తరణ, మెట్రో అలైన్‌మెంట్‌లో దాదాపు 1100 ఆస్తులు ప్రభావితమవుతున్నాయి. ప్రభావితమైన 400 ఆస్తులకు ఇప్పటికే నోటిఫికేషన్‌లు జారీ చేసాము. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. ఈ మార్గంలో దాదాపు 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయి. వాటన్నింటికీ తగిన ఇంజినీరింగ్ పరిష్కారాలు, మెట్రో పిల్లర్ స్థానాల సర్దుబాటు ద్వారా అవి భంగం కాకుండా చూస్తున్నాము.

ఇది దాదాపు 6 స్టేషన్లతో పూర్తి ఎలివేటెడ్ మెట్రో కారిడార్. కారిడార్ VII ముంబై హైవేపై రెడ్ లైన్ పొడిగింపుగా నిర్మించబడుతోంది. ప్రస్తుతం ఉన్న మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి ప్రారంభించి, పటాన్‌చెరు వరకు ఉన్న ఈ 13.4 కి.మీ లైన్ ఆల్విన్ X రోడ్, మదీనాగూడ, చందానగర్, బిహెచ్ఈఎల్, ఇక్రిసాట్ మీదుగా వెళ్తుంది. ఇది దాదాపు 10 స్టేషన్లతో ఉండే పూర్తి ఎలివేటెడ్ కారిడార్.

కారిడార్ VIII విజయవాడ హైవేపై ఎల్ బి నగర్ వైపు నుండి రెడ్ లైన్ పొడిగింపుగా నిర్మించడం జరుగుతుంది. ఎల్ బి నగర్ నుండి హయత్ నగర్ వరకు ఈ 7.1 కిమీ కారిడార్ చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీ మీదుగా వెళుతుంది. ఈ పూర్తి ఎలివేటెడ్ కారిడార్‌లో దాదాపు 6 స్టేషన్లు ఉంటాయి.

సిఎం ప్రత్యేక దృష్టి సారించిన ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీ లైన్ కోసం అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో వినూత్న రీతిలో డిపిఆర్ తయారు చేస్తున్నాము. కొన్ని నెలల్లో కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం దీనిని సమర్పించడం జరుగుతుంది. ఈ కొత్త లైన్ డీపీఆర్ మినహా మిగిలిన డీపీఆర్ లను త్వరలో నే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించబడతాయి.

ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీ కోసం సుమారు రూ.8,000 కోట్లతో కలిపి మొత్తం రెండవ దశ ప్రాజెక్ట్ కు అయ్యే వ్యయం దాదాపు రూ.32,237 కోట్లు (రూ. 24,237 కోట్లు + రూ. 8,000 కోట్లు)గా అంచనా వేయబడింది. ఇతర భారతీయ నగరాల్లోని ఇతర మెట్రో రైలు ప్రాజెక్టుల మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్‌గా ఈ ప్రాజెక్ట్ అమలు చేయడానికి ప్రతిపాదించబడింది.

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎం. దానకిశోర్, సీఎం స్పెషల్ సెక్రటరీ శ్రీ బి. అజిత్ రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ మిస్ అమ్రపాలి కాటా, ఇతర సీనియర్ అధికారులు ఈ చర్చలో పాల్గొన్నారు. *****

Advertisement

తాజా వార్తలు

Advertisement