Saturday, September 14, 2024

TG – మూడు నెల‌ల్లోపే భూముల క్రమబద్దీకరణ – మంత్రి పొంగులేటి

హైదరాబాద్: లక్షలాది కుటుంబాలకు లబ్ధిచేకూర్చే లేఅవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్‌ఆర్‌ఎస్) ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరణ జరగాలని, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, మధ్య దళారుల ప్రమేయం లేకుండా సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియలో ముఖ్యంగా ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

భూపాలపల్లి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ఆ జిల్లా కలెక్టర్ ఆఫీసు నుండి ఎల్.ఆర్.ఎస్. పై శనివారం నాడు జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆగస్టు 31 నుండి అక్టోబర్ 31, 2020 వరకు ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల ను సీకరించింది ఆమోదించింది. ఈ సమయంలో 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయని, గత నాలుగు సంవత్సరాలుగా ఈ దరఖాస్తులు ఎలాంటి పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు.

- Advertisement -

మొత్తం 25.70 లక్షల దరఖాస్తుల్లో హెచ్‌ఎండీఏ పరిధిలో 3.58 లక్షలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1.06 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో పరిధిలో 13.69 లక్షలు మరియు గ్రామ పంచాయతీల్లో 6 లక్షలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటి పరిధిలో 1.35 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుదారులు సమస్య పరిష్కారం కొరకు నాలుగు సంవత్సరముల నుండి ఎదురుచూస్తున్నారు. ఈ దరఖాస్తులను అత్యంత ప్రాదాన్యతాక్రమములో పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు.

ఇందుకోసం, జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ పై తీసుకోవాలని, ప్రతిపాదనలు పంపిస్తే రెవెన్యూ శాఖ నుంచి సిబ్బందిని సర్దుబాటు చేస్తామని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందాలను ఏర్పాటుచేయాలి. క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీచేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్ లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు (హెల్ప్ డెస్క్లు) వెంటనే ఏర్పాటు చేసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఆథారిటీ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారని తెలిపారు.

ఎల్అర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో భాగస్వాములయ్యే అన్ని స్థాయుల సిబ్బంది , అధికారులకు శిక్షణ తక్షణమే చేపట్టాలని కోరారు. ఎల్ఆర్ఎస్ విధివిధానాలను విడుదల చేసిన నేపథ్యంలో అమలుకు అవసరమైన కార్యాచరణను చేపట్టాలని, జిల్లా కలెక్టర్ లు ఈ ప్రక్రియ ను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాలల్లో అత్యంత విలువైన భూములు ఉన్నాయని ఈ జిల్లాల్లో లేఅఔట్ ల క్రమబద్దీకరణ విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ప్రణాళికాబద్ధమైన స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తుందన్నారు. వారి ఆస్తులకు చట్టపరమైన గుర్తింపుతో సహా ఆమోదించబడిన లేఅవుట్ల ద్వారా అభివృద్ధిని ప్రోత్సహిస్తుందన్నారు. ఆమోదించబడిన లేఅవుట్ యజమానులకు ఇంటి నిర్మాణాలకు భవన నిర్మాణ అనుమతులు పొందేందుకు, బ్యాంకు రుణాలు పొందేందుకు, కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి సహాయపడుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement