Tuesday, July 2, 2024

TG – వాళ్ల‌కేమో ప‌ద‌వులు… వీళ్ల‌కేమో జైళ్లా….రేవంత్ పై హ‌రీష్ మండిపాటు

నిరుద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్
గ్రూప్ మెయిన్ నిష్ప‌త్తి పెంచాల్సిందే
అప్పుడేమో హామీలు.. ఇప్పుడేమో నిరుద్యోగుల‌పై లాఠీలా

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో బల్మూరి వెంకట్‌, తీన్మార్‌ మల్లన్నకు ఉద్యోగాలు వచ్చాయని.. ధర్నాలు చేస్తున్న గ్రూప్స్‌ అభ్యర్థులకు మాత్రం రాలేదని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిప‌డ్డారు.. హైద‌రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్‌ను ఆయన పరామర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ,. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ మోతీలాల్‌ నాయక్‌ నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు. దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ప్రజా పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు.

- Advertisement -

ఎన్నికల ముందు నిరుద్యోగులపై కపట ప్రేమ చూపించిన కాంగ్రెస్‌ పార్టీ.. గద్దెనెక్కిన తర్వాత వారి గుండెల మీద తన్నుతున్నదని విమర్శించారు. రాహుల్‌ గాంధీని అశోక్‌నగర్‌కు పిలిపించి మరీ హామీ ఇప్పించారని తెలిపారు. రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని రాహుల్‌ మాట ఇచ్చారని గుర్తుచేశారు. జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందని నిలదీశారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు ఆంధ్రప్రదేశ్‌లో 1:100 పిలుస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యంకాదని ప్రశ్నించారు. మోతీలాల్ నాయక్ గత ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే కాంగ్రెస్ సర్కారుకి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ప్రభుత్వం మొద్దునిద్ర పోతున్నదని విమర్శించారు. ఇది తన ఒక్కడి కాదని, నిరుద్యోగులందరి సమస్య అంటున్నాడని చెప్పారు.

గ్రూప్‌-2, 3 ఉద్యోగాల సంఖ్య పెంచాలని డిమాండ్‌ చేశారు. జీవో 46 రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ ఎందుకు వేయడం లేదని, ప్రైమరీ స్కూల్స్‌లో టీచర్‌ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తామన్నారు. అసెంబ్లీని స్తంభింపచేస్తామని చెప్పారు. మోతీలాల్‌కు ఏమైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎం రేవంత్‌ రెడ్డి వచ్చి చర్చలు జరపాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement