Friday, October 18, 2024

TG: దేశ ముఖచిత్రాన్ని మార్చేది విద్యనే… మంత్రి సీతక్క..


హైదరాబాద్ : సారం లేని భూమి.. విద్య లేని జీవితం ఒక్కటేన‌ని, దేశ ముఖచిత్రాన్ని మార్చేది విద్యనే అన్నారు రాష్ట్ర మంత్రి సీతక్క. ఇవాళ‌ గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో హైసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్ విద్య సదస్సులో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో డిజిటల్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించేందుకు సమావేశమైనందుకు అభినందనలు తెలిపారు. మనిషి జీవితంలో విద్య అనేది చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

సమాజంలో ఇంకా అంతరాలు ఉన్నాయి. విద్యా బోధనలో కూడా అంతరాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాల్లో ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందన్నారు. పట్టణ ప్రాంతాలకు మెరుగైన విద్య అందుతుందని, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారు. అందుకే విద్యలో ఉన్న అంతరాలను తొలగించాలని సీతక్క పేర్కొన్నారు. సమానత్వ సాధన దిశలో విద్య కీలక పాత్ర పోషిస్తుందన్నారు. హైదరాబాద్‌లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఉందో, మరుమూల పల్లెలో అలాంటి విద్య ఉండాలని తెలిపారు.

ఆ దిశలోనే తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గ్రామీణ విద్యార్థులకు అవకాశం కల్పిస్తే బాగా రాణిస్తారన్నారు. కానీ వారికి అవకాశాలు, వస్తువులు లేక వెనుకబాటుతనానికి గురవుతున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి కేంద్రీకరణ జరగాలి, అప్పుడే అందరికీ సమాన అవకాశాలు అందుతాయన్నారు. అప్పుడు సమాజంలో పోరాటాలు ఉండవు, అందుకే అభివృద్ధి కేంద్రీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఒక మంచి పని చేస్తే జీవితంలో గొప్ప ఆనందం, అనుభూతి మిగులుతుందని సీతక్క వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement