Sunday, September 8, 2024

TG – నేడు హ‌స్తం తీర్థం పుచ్చుకుంటున్నా – బిఆర్ఎస్ ఎమ్మెల్యే

తిరుమ‌ల – సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రకటించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరికపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తన నియోజకవర్గ అభివృద్ది కోసమే పార్టీలో జాయిన్ అవుతున్నానని, సాయంత్రం ఏడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. తమ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిపై సీఎం గారిని ఇదివరకే కలిశామని, రూలింగ్ పార్టీలో ఉంటే సమస్యల పరిష్కారం అవుతాయని చేరుతున్నామని అన్నారు.గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ నాయకత్వంలో కొంత అభివృద్ది చేసుకున్నామని, ఎవరిపై బురద జల్లేది లేదని స్పష్టం చేశారు. భయభ్రాంతులకు గురి చేసి పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. బెదిరించడానికి తామేమి చిన్నపిల్లలం కాదని, మాకు ఎక్కడ ఒత్తిడి లేదని, మా ఇష్ట ప్రకారమే పార్టీలోకి వెళుతున్నామని అన్నారు.

అలాగే రేవంత్ రెడ్డికి కూడా ఆ అవసరం లేదని, ఆయనకు స్పష్టమైన మెజారిటీ ఉందని, కేవలం నియోజకవర్గ సమస్యలను తీర్చుకునేందుకు మాత్రమే రూలింగ్ పార్టీలో చేరుతున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబును కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామనేది అవాస్తవం అని, ఆయనతో కలిసినప్పుడు ఎక్కడ ఉన్నా మీరు మంచిగా ఉండాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నారని, తాను కొత్త రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవాలని, తర్వాతే ఈ రాష్ట్రానికి వస్తానని చెప్పారని, చంద్రబాబు త‌మ‌ రాజకీయ గురువు కావడంతోనే ఆయన్ను కలిశామని అన్నారు. ఇంకా ఎవరెవరు పార్టీ మారుతారనే దానిపై స్పష్టత లేదని, తాను మాత్రం ఒంటరిగానే చేరుతున్నానని తెలిపారు. రేవంత్ రెడ్డి యువకుడు, తెలివైన వాడు, ప్రజా సమస్యలు తెలిసినవాడని, మరో 10 సంవత్సరాలు అధికారంలో ఉంటాడని నమ్మకం ఉందని, దీంతో మరింత అభివృద్ది చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే వెళుతున్నామన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో మంచి స్వేచ్చ ఉంటుందని, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు రేవంత్ రెడ్డి మంచి గౌరవం ఇస్తాడని, రేవంత్ రెడ్డితో మంచి సాన్నిహిత్యం ఉందని, అందరూ బాగుండాలని కోరుకుంటారని ప్రకాశ్ గౌడ్ అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement