Saturday, September 7, 2024

TG – సింగ‌రేణిని కాపాడుకుంటాం…..ప్ర‌ధానిని క‌ల‌సి మాట్లాడ‌తాం – ఉప‌ ముఖ్య‌మంత్రి భ‌ట్టి

సింగరేణిని కాపాడుకోవడానికి అవసరమైతే ప్రధాని నరేంద్రమోదీని కలుస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. శ్రావణపల్లి బొగ్గు గనులను కేంద్రం వేలం వేస్తోందని ఈ విషయమై కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలుస్తామన్నారు. ఖమ్మంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సింగరేణి, బొగ్గు గనులపై బీఆర్ఎస్ నేతల తీరు దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉందన్నారు. గనుల వేలం సమయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని మండిపడ్డారు.

సింగరేణి సంస్థలో 42 వేల మంది రెగ్యూలర్, 6 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం సంస్థ ద్వారా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయిందని అన్నారు. ఏనాడు ఉద్యోగులను పట్టించుకోని గత ప్రభుత్వం ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని అన్నారు. 2031-32 వరకు బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని సింగరేణి నిలబెట్టుకోవాలన్నా.. ఉద్యోగుల మనుగడ కొనసాగాలన్నా కేంద్రం నిర్వహించే గనుల వేలంలో సింగరేణి యాజమాన్యం తప్పనిసరిగా కొత్త బొగ్గు గనులను సొంతం చేసుకోవాల్సిందేనని అన్నారు. లేని పక్షంలో సింగరేణి సంస్థ చరిత్రలో కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న కోల్ బ్లాక్స్ అన్నింటిని కూడా ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి ఇస్తే బాగుండేది అన్నారు.

- Advertisement -

కానీ, 2015 సంవత్సరంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మైన్స్ అండ్ మినరల్స్ డెవెలప్‌మెండ్ రెగ్యూలేషన్ యాక్ట్-1957 యాక్ట్‌లో సవరణ తీసుకొచ్చి దేశంలో ఉన్న బొగ్గు గనులను అన్నింటిని ప్రభుత్వ రంగ సంస్థకు నేరుగా ఇవ్వకుండా.. వేలంపాట ద్వారా ప్రైవేటు రంగ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర చేసిందన్నారు. మైన్స్ అండ్ మినరల్స్ డెవెలప్‌మెండ్ రెగ్యూలేషన్ యాక్ట్-1957 యాక్ట్‌లో సవరణ బిల్లుకు పార్లమెంటులో ఆనాడు బీఆర్ఎస్‌ కూడా మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. నేడు సింగరేణి విషయంలో బీఆర్ఎస్ తీరు దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు.

బొగ్గు గనుల వేలం సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మాటలు రాష్ట్రానికి మంచివి కాదన్నారు. దేశంలో ఉన్న బొగ్గు గనులను ప్రభుత్వ సంస్థలకు దక్కకుండా చేయాలని బీజేపీ చట్టం తీసుకు వచ్చిందని ఆరోపించారు. అందుకే బొగ్గు గనులు పొందాలంటే వేలంలో పాల్గొనాలని షరతు విధించిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement