హైదరాబాద్ – తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో అధికార,విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది… ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభంకాగానే బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సర్పంచ్ ల బిల్లుల చెల్లింపుపై ప్రశ్నించారు. దీనిపై మంత్రి సీతక్క ఘాటుగానే సమాధానం ఇచ్చారు..
రూ.691 కోట్ల బకాయిలు..
కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. బిల్లులు రాక సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారాన్ని తాకట్టు పెట్టి సర్పంచ్ లు పనులు చేశారని చెప్పారు. తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేని దీన స్థితిలో సర్పంచ్ లు ఉన్నారని అన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఏకంగా ఒక్క నెలలోనే బడా కాంట్రాక్టర్ లకు 1200 కోట్లు చెల్లించారని హరీశ్ సభ దృష్టికి తెచ్చారు.. ఇప్పటికే 691 కోట్లు సర్పంచ్ లకు ఇవ్వాల్సి ఉందన్నారు.
తెలంగాణ వెళితే చికెన్ గున్యా..
తెలంగాణకు వెళితే చికున్ గున్యా వస్తుందని అమెరికాలో చెప్పుకుంటున్నారని… ఇది తెలంగాణ రాష్ట్రానికి అవమానమని హరీశ్ రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధులు విడుదల కావడం లేదని చెప్పారు. పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గత 9 నెలలుగా గ్రామ పంచాయతీ ఉద్యోగులకు, సర్పంచ్ లకు జీతాలు లేవని చెప్పారు. బిల్లులు, జీతాలను ఎప్పటిలోగా క్లియర్ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని దుయ్యబట్టారు.
తెలంగాణ పల్లెలను కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిపారని హరీశ్ రావు కొనియాడారు. గ్రామాలను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీరు పెట్టిన బకాయిలే….
దీనిపై మంత్రి సీతక్క సమాధానం చెబుతూ, 2014 నుంచి మీరు పెట్టిన బకాయిలే అంటూ ఎత్తిపొడిచారు. మీరు ఆర్థిక మంత్రిగా ఉండి కూడా సర్పంచ్ బిల్లులపై ఎందుకు సంతకం పెట్టలేదని నిలదీశారు. బిఆర్ఎస్ పార్టీ అంటే బకాయిల రాష్ట్ర సమితి అంటూ వ్యాఖ్యనించారు.. మీరు పెట్టిన బకాయిలే క్రమ పద్దతిలో చెల్లింపులు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఖాళీ ఖజనా, బకాయిలు మా చేతిలో పెట్టి వెంటనే చెల్లించమంటే ఎలా అంటూ హరీశ్ కు కౌంటర్ ఇచ్చారు. పల్లె ప్రగతి నిధులు విడుదల చేయకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని సీతక్క వివరించారు..
అయితే అయితే సర్పంచుల పెండింగ్ బిల్లులపై మంత్రి సమాధానానికి నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ఆనాడు తాము పల్లె ప్రగతి కింద రూ. 3300 కోట్లు పంచాయితీలకు ఇచ్చామని హరీష్రావు తెలిపారు. ప్రతినెల రూ.227 కోట్లు పంచాయితీలకు ఇచ్చామన్నారు. ఆ విధానాన్ని కాంగ్రెస్ కొనసాగించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. మంత్రి సమాధానం సరిగా లేని కారణంగా సభ నుండి వాకౌట్ చేస్తున్నామని హరీష్రావు తెలిపారు .