Friday, September 13, 2024

TG – 200 ఎకరాల‌లో ఏఐ సిటీ … గ్లోబ‌ల్ స‌మ్మిట్ లో రేవంత్ వెల్ల‌డి

ఇది త‌మ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ వెల్ల‌డి
ఐటి రంగాన్ని ప‌రిచ‌యం చేసేందుకు ఈ స‌ద‌స్సు
కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు సంపూర్ణ ప్రొత్సాహం
హైద‌రాబాద్ ఫోర్త్ సిటీలో అంద‌రికి అవ‌కాశాలు
దేశానికే మార్గ‌ద‌ర్శ‌కంగా ఫోర్త్ సిటీ నిర్మాణం

హైద‌రాబాద్ – ఎన్నికల ముందు డిక్లరేషన్ లో చెప్పినట్టే AI కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో రెండు రోజుల పాటు జ‌రిగే AI గ్లోబల్ సమ్మిట్ ను రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తో క‌లిసి ప్రారంభించారు. కాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. ప్ర‌పంచం నలుమూలల నుండి వ‌చ్చిన రెండు వేల మందికి పైగా కృత్రిమ మేధస్సు రంగంలో ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రారంభ సంద‌ర్భంగా AI రోడ్ మ్యాప్ ను ముఖ్యమంత్రి విడుదల చేశారు.

- Advertisement -

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, ఐటీ రంగంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మించనున్న నాలుగో నగరంలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైల్ ఇంజిన్, ఫోటో కెమెరా మొదలు కొని ఇప్పుడు AI కి వచ్చామన్నారు. క్రమంగా టెక్నాలజీ పెరుగుతోందన్నారు.

అంద‌రికీ అవ‌కాశాలు..

ఎన్నికల ముందు డిక్లరేషన్ లో చెప్పినట్టే AI కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఇతర పరిజ్ఞానం కి చెందిన వారికి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అందరికి అవకాశం ఇస్తున్నామని తెలిపారు. సాంకేతికత, ఆవిష్కరణ లేకుండా సమాజంలో ఏ మార్పు జరగదన్నారు. మొదటి రైలు, ఇంజిన్ ఆవిష్కరణ తరువాత ప్రపంచం పూర్తిగా మారిందన్నారు. విమానం ఆవిష్కరణతో ప్రపంచ స్వరూపమే మారిపోయిందన్నారు. ఇదే క్రమంలో కరెంటు, బల్బు, టీవీ, కెమెరా, కంప్యూటర్ – ఇవన్నీ ప్రపంచ గతిని మార్చడంలో కీలక పాత్ర పోషించాయన్నారు. టెలివిజన్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ చూడటం మన తరం చేసుకున్న అదృష్టం అన్నారు. ఇవాళ ప్రపంచ సాంకేతికరంగంలో వచ్చిన అత్యుత్తమ ఆవిష్కరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు.

కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా కొంత భయం నెలకొంటుందని తెలిపారు. అది మన జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుంది.. అదే సమయంలో ఉద్యోగాలు పోతాయా భయం ఉండటం సహజం అన్నారు రేవంత్. దేశ చరిత్రను పరిశీలిస్తే.. గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాన్ని సరిగ్గా అనుసరించలేకపోయామని తెలిపారు. భారతదేశ భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తే.. హైదరాబాద్‌ సిటీలా మరీ సిటీ పరిశ్రమల ఏర్పాటుకు సంపూర్ణంగా సిద్ధంగా లేద‌న్నారు.

మా చిత్త‌శుద్ధిని శంకిచ‌వ‌ద్దు..

ఇందుకు సంబంధించిన సవాళ్ళను స్వీకరించడమే కాదు… భవిష్యత్తును సృష్టిస్తామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై త‌మ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం చాలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ రంగంలో మన భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటున్నామన్నారు. తెలంగాణ AI మిషన్, లేదా NASSCOM భాగస్వామ్యంతో T-AIM తెలంగాణలో AI ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయడంలో త‌మ‌కు సహకరిస్తాయన్నారు ముఖ్య‌మంత్రి. ఇండస్ట్రీ నిపుణులతో కలిసి ఆవిష్కరణలను ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందన్నారు. హైదరాబాద్ ను AI హబ్ గా తీర్చిదిద్దబోతున్నామనేందుకు ఈ సదస్సు నిదర్శనం అన్నారు. సిటీ ఆఫ్ ది ఫ్యూచర్‌కి మీ అందరికి స్వాగతం అన్నారు. మనమందరం కలిసి ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప AI హబ్ గా తీర్చిదిద్ధే సంకల్పంతో మీరంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement