Tuesday, September 24, 2024

Telangana – బిఆరెస్ ఎమ్మెల్యేలంద‌రూ మా ట‌చ్ లోనే – విహెచ్

హైద‌రాబాద్ – తిరుమలలో పవిత్రమైన శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందన్న ప్రచారంపై సమగ్ర విచారణ కోసం సీబీఐ విచారణ జరగాలని డిమాండ్‌తో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్ దీక్షకు కూర్చున్నారు. ముందుగా ఆయ‌న హిమ‌య‌త్ న‌గ‌ర్ లోని టిటిడి శ్రీవెంక‌టేశ్వ‌ర స్వామి వారి ఆల‌యంలో శ్రీవారిని ఆయ‌న ద‌ర్శించుకున్నారు.. అనంత‌రం అక్క‌డే ఆయ‌న దీక్ష చేపట్టారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, తిరుమ‌ల‌లో జ‌రిగిన ఘ‌ట‌న క‌లిచి వేసింద‌న్నారు. భ‌గవంతుడి దగ్గర కూడా అవినీతికి పాల్పడటం దౌర్భాగ్యమని అన్నారు. ప్రపంచంలోనే వెంకన్నల‌డ్డూకు పవిత్రత ఉంటుందని తెలిపారు. అలాంటి పవిత్రమైన లడ్డులో జంతువుల కొవ్వు కలపడం దారుణమన్నారు. ప్రపంచ దేశాలలో వెంకన్న భక్తులు ఉన్నారని తెలిపారు. గతంలో వైసీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందన్నారు.

సీబీఐ విచార‌ణ చేస్తే వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి…
తిరుమలలో దేవుడిపై ఒట్టు వేస్తూ రాజకీయం చేస్తున్నారని వీహెచ్‌ తెలిపారు. సీబీఐ విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. తాను చేస్తున్న దీక్షతో అయిన కేంద్ర ప్రభుత్వంలో చలనం రావాలని పేర్కొన్నారు. ఈ సమస్య తొందరగా పరిష్కరించాలి … లేకపోతే ప్రజల్లో గందరగోళం పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. సీబీఐ విచారణ త్వరగా చేసి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నారు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త‌మ‌తో టచ్ లో ఉన్నారని వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఒక్కసారి గేట్లు తెరిస్తేనే మీరు తట్టుకోలేర‌ని, రేపటి నుంచి త‌మ‌ టార్గెట్ బావబామ్మర్దులు కేటీఆర్, హరీష్ రావు అని వ్యాఖ్యలు చేశారు. గోమారంలో జరిగిన చిన్న విషయాన్ని కావాలని రాజకీయం చేశారని మండిపడ్డారు.


బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్లు ఇవ్వాలో రేపు మన పార్టీలోకి వస్తారు..వాళ్ళని ఏమి అనవద్దు వాళ్ళు కూడా మనవాళ్లే అన్నారు. 10 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కోనుగోలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ ది అన్నారు. కానీ గాంధీ ఒక్క రూపాయి తీసుకోకుండా బీఆర్ఎస్ పార్టీలో చేరారని తెలిపారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని తెలిపారు.
కేటీఆర్ రేపటి నుంచి నీకు ఉంటుంది ఇక కాసుకో బిడ్డా అంటూ హెచ్చరించారు. కొండగట్టు లో బస్సు ప్రమాదం, మాసాయిపేట ఘోర రైలు ప్రమాదం జరిగినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారన్నారు. ప్రభుత్వం పోగానే తెలంగాణ, ఆంద్ర అంటూ చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. సెక్రటేరియట్ ను కూల్చి బీఆర్ఎస్ వాళ్ళు నిధులు ఎత్తుకెళ్లారు అన్న ప్రచారం ఉందన్నారు. ఈ రోజు మీరు కట్టిన సెక్రటేరియట్ లో అన్ని లీకులు అవుతున్నాయన్నారు. బీఆర్ఎస్ వాళ్ళవి క్రిమినల్ మైండ్ లు… విద్యుత్ అధికారులు కొందరు బీఆర్ఎస్ వాళ్ళకి సహకరిస్తున్నార‌ని తెలిపారు. బీఆర్ఎస్ మీటింగ్ లకి వాళ్లే కావాలని కరెంట్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు.

హరీష్ రావు, కేటీఆర్ 50 యూట్యూబ్ ఛానెళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. దోచుకుతిన్న డబ్బులు ఎక్కువై యూట్యూబ్ ఛానెళ్లను బావబామ్మర్దులు నడుపుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వచ్చి 8 నెలలు కాలేదు.. అధికారం పోయాక బీఆర్ఎస్ వాళ్ళకి నిద్ర పట్టడం లేదన్నారు. గోమారంలో జరిగిన ఘటన అదొక ఇష్యూనా..? అని ప్రశ్నించారు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయాలని హరీష్ రావు చూస్తున్నారన్నారు. చిన్న విషయానికి గోమారం రావడం అవసరమా హరీష్ రావు అన్నారు. ఈ పద్దతి మార్చుకోవాలని హరీష్ రావుకి సూచించారు. హరీష్ రావు గోమారం వచ్చి తన స్థాయిని దిగజార్చుకున్నాడన్నారు. హరీష్ రావు మాట్లాడితే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement