Friday, September 20, 2024

Telangana – నీట్ కౌన్సిలింగ్ విద్యార్ధుల‌కు ఊర‌ట … రాష్ట్రంలో నివాసం ఉంటున్న వారికి ఈ ఏడాది అవకాశం

పాత విధానంలోనే స్థానిక‌త నిర్ణ‌యం
ఈ ఏడాది పాత విధానం పాటిస్తామ‌న్న తెలంగాణ ప్ర‌భుత్వం
రాష్ట్రంలో నివాసం ఉంటున్న వారంద‌రూ స్థానికులే
హైకోర్టు తీర్పుపై మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చిన సుప్రీం కోర్టు

హైద‌రాబాద్ : నీట్ కౌన్సెలింగ్ స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సెలింగ్ కు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కౌన్సెలింగ్ సమయం అతి తక్కువగా ఉండటంతో ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -

స్థానికత వ్యవహారంపై రాష్ట్రంలో నివాసం ఉంటున్న వారందరూ లోకల్ కిందకు వస్తారంటూ, వారికి మెడికల్ కౌన్సెలింగ్ లో తెలంగాణ వారిగానే పరిగణిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నేడు విచారణ జరిపింది. ఈ ఒక్కసారికి హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు అవకాశం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు తెలిపారు. స్థానికతను నిర్ధారిస్తూ నాలుగు రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నాయని గుర్తు చేశారు. అన్ని తీర్పులు స్పష్టంగా ఉన్నా మళ్లీ కోర్టును ఆశ్రయించారన్నారు.

ఆ వాదనతో విద్యార్థుల తరపు న్యాయవాది విభేదించారు. కేవలం రెండు, మూడేళ్లు చదువుల కోసం రాష్ట్రానికి దూరంగా ఉంటే స్థానికతను దూరం చేయకూడదని వాదించారు. మెరిట్స్ లోకి వెళ్లేంత సమయం ఇప్పుడు లేదని రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని సీజేఐ సూచించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందిస్తూ విద్యార్థుల భవిష్యత్, ప్రస్తుత సమయాభావం కారణంగా కౌన్సెలింగ్ కు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

తదుపరి విచారణకు ప్రతివాదులందరికీ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినందున హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్ కు హారయ్యేందుకు అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement