అప్పుకోసం వరల్డ్ బ్యాంకు దగ్గరికి ఎలా వెళ్లారు
ఏమీ లేకుండానే కేంద్ర మంత్రిని ఫండ్స్ కోసం ఎందుకు కలిశారు
పలు అంశాలను లేవనెత్తిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు
ఆ నిధులన్నీ పునరుద్ధరణ కోసం కాదన్న మంత్రి శ్రీధర్బాబు
ఈ విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం
మూసీ సుందరీకరణపై మండలిలో వాడీవేడి చర్చ
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : శాసన మండలిలో నేడు మూసీ పునరుజ్జీవనంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కవిత, రాజు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణ కోసం డీపీఆర్ ఇప్పుడు చేస్తున్నాం అంటున్నారు.. మరి డీపీఆర్ లేకుండా వరల్డ్ బ్యాంకుకు రూ.4100 కోట్లు అప్పు కావాలని ఎలా అడిగారని ప్రశ్నించారు. మూసీ డీపీఆర్ ఇంకా అవ్వకుంటే.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి రూ. 14 వేల కోట్లు కావాలని ఏ ప్రాతిపదికన అడిగారని నిలదీశారు. గ మండలిలో మూసీ సుందరీకరణపై వాడీవేడిగా చర్చ జరిగింది.
ఎంఆర్డీసీఎల్ ద్వారా డీపీఆర్
కాగా, మండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిస్తూ.. మూసీ అభివృద్ధి కోసం మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా డీపీఆర్ రూపొందిస్తున్నామని తెలిపారు. వరల్డ్ బ్యాంకుకు ప్రభుత్వం ఇచ్చిన రూ.4,100కోట్ల ప్రతిపాదనలు మూసీ ప్రక్షాళన ప్రతిపాదనలు కాదని, మూసీ ఇరువైపుల ట్రంక్ సివరేజీ లైన్లు కావాలని మెట్రో వాటర్ వర్క్స్ ఎస్టిమేట్స్ అని స్పష్టం చేశారు. డీపీఆర్ ఫైనలైజ్ కాదని, నిధులపైన స్పష్టత ఇంకా రాలేదని చెప్పారు. మూసీ రివర్ బెడ్ లో నివసిస్తున్న పేదలకు మంచి నాణ్యమైన జీవనం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సుందరీకరణ అంటే అక్కడి పేదల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే అంశమన్నారు.
రాద్దాంతం అనవసరం..
రూ. లక్ష 50 వేల కోట్ల నిధులపై ప్రతిపక్షాలకు రాద్ధాంతం అవసరం లేదని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన మూసీ ప్రక్షాళనలో లక్షన్నర కోట్లు రూపాయలు అవుటర్ రింగ్ రోడ్డు వరకు చేపట్టాల్సిన రోడ్లు, కారిడార్లు, లింక్ రోడ్లు, ఎఫ్టీసీలు, గోదావరి నీటి తరలింపు, మెట్రో విస్తరణ, మూసీ నిర్వాసితులకు సహాయ, పునరావాసాలు వంటి వాటికి సంబంధించిన ఎస్టిమేట్లు ఉన్నాయన్నారు.
బఫర్ జోన్ను బీఆర్ఎస్ ప్రభుత్వమే పెంచింది
మూసీ బఫర్ జోన్ను 30 మీటర్ల నుంచి 50 మీటర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వమే పెంచిందని శ్రీదర్బాబు తెలిపారు. రివర్ బెడ్ నిర్వాసితుల సంఖ్యను ఏడు వేలకు చూపించగా, బఫర్ జోన్లో 2,108 నిర్వాసితుల సంఖ్యను గుర్తించగా, ప్రస్తుతం ఆ సంఖ్య పెరిగిపోయిందన్నారు. లక్ష ఇళ్లకు మార్కింగ్ చేశామంటున్నారని, బఫర్ జోన్ లో అసలే మార్కింగ్ చేయలేదని దీనిపై ప్రతిపక్ష సభ్యులు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. 2,116 ఇళ్లు రివర్ బెడ్లో ముంపుకు గురవుతున్నాయని, వాటిలో 309 ఇళ్లకు కలెక్టర్ ఇన్సెంట్ ఇచ్చారన్నారు. 715 బఫర్ జోన్లో గుర్తించామన్నారు. మానవీయ కోణంలో రివర్ బెడ్ లో కట్టుకున్న ఇళ్లకు డబ్బులు ఇస్తున్నామన్నారు.