Thursday, October 17, 2024

Telangana DGP : పోలీసుల డీపీతో ఫోన్ కాల్స్.. డీజీపీ బిగ్ అలర్ట్

ఇటీవల సైబర్ కేటుగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఏకంగా పోలీసుల డీపీతో ఫోన్ కాల్స్ చేసి ఉచ్చులోకి లాగుతున్నారు. ఇంట్లో వాళ్లు ఓ పెద్ద నేరం చేశారంటూ పోలీసుల నుంచి ఫోన్ వస్తే బెదిరిపోవడం ఖాయం కదా.. ఎలాగైనా తమ వాళ్లను కాపాడుకోవాలని, అవసరమైతే అప్పు చేసైనా సరే డబ్బు ఇచ్చేందుకు సిద్ధమవుతాం.. ఇదిగో ఈ భయాన్నే సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఈ నయా మోసానికి తెరలేపారు. ఈ కొత్తరకం మోసం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ డీజీపీ జితేంద‌ర్ ఓ వీడియో ట్వీట్ చేశారు. ఇలా కూడా జరుగుతుందని చెబుతూ కేటుగాళ్ల మాయలో పడొద్దని హెచ్చరించారు.

సైబర్ కేటుగాళ్లు కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేసి టార్గెట్ చేసిన వ్యక్తులను ముందుగా బెదరగొడతారని వివరించారు. డీపీగా పోలీస్ యూనిఫాంలో ఉన్న ఓ ఆఫీసర్ ఫొటో పెట్టుకోవడం వల్ల అది చూసి కొంత జంకుతూనే ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఆపై తమ మాటలతో వారిని మరింత భయపెట్టి అందినకాడికి ఆన్ లైన్ లో రాబట్టుకుంటారని డీజీపీ వివరించారు.

డీజీపీ ట్వీట్ చేసిన వీడియోలో ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి తాను ముంబై పోలీసునని, మీ అబ్బాయి రేప్ కేసులో పట్టుబడ్డాడని చెబుతాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే మీ అబ్బాయి జీవితం నాశనమవుతుందని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తాడు. అయితే, ఫోన్ ఎత్తిన వ్యక్తి కాస్త నిబ్బరంగా మాట్లాడుతూ.. ఎక్కడ, ఎప్పుడు, మీరు ఏ స్టేషన్ లో పనిచేస్తున్నారంటూ ఆరా తీయడంతో ఫోన్ పెట్టేశాడు.

- Advertisement -

ఈ మొత్తం వ్యవహారాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ వీడియోను తెలంగాణ డీజీపీ షేర్ చేస్తూ.. ఇలాంటి సందర్భాలలో కాస్త తెలివిగా వ్యవహరించాలని డీజీపీ సూచించారు. కుటుంబ సభ్యులు ఏదైనా నేరం చేసి పట్టుబడ్డారని చెప్పినా.. లేక వాళ్ల పేరు మీద డ్రగ్స్ కొరియర్లు వచ్చాయని చెప్పినా.. టెన్షన్ పడి డబ్బు సమర్పించుకోకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement