Monday, September 16, 2024

Telangana – ఇది ముమ్మాటికి రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వ‌మే – మాజీ మంత్రి కెటిఆర్

హైదరాబాద్ ఆంద్రప్రభ – అదిలాబాద్‌లో రైతుపై లాఠీచార్జి చేసిన ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు . తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతన్నల పైన దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతన్నల సమస్యలను పట్టించుకోవాలని ముఖ్యమంత్రికి సూచించారు.

అయిదు నెల‌ల పాల‌న‌లోనే సంక్షోభంలో రైతాంగం

- Advertisement -

రైతన్నల పైన లాఠీచార్జ్ చేసిన అధికారుల పైన కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతన్నలపైన ప్రభుత్వం దాడులు చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. విత్తనాల కోసం బారులు తీరిన రైతన్నలపై లాఠీచార్జ్ అత్యంత దారుణం అని అన్నారు. ఇది రైతన్నలపైన ప్రభుత్వ దాడి అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లో రాష్ట్ర వ్యవసాయ రంగం, రైతన్నల పరిస్థితి పూర్తిగా దిగజారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ముమ్మాటికి ప్రభుత్వ పరిపాలన వైఫల్యమే అన్నారు.

సాగునీరు నుంచి విత్త‌నాల వ‌ర‌కు ఇవ్వ‌లేని ప్ర‌భుత్వం..

రైతన్నలకు కావాల్సిన సాగునీటి నుంచి మొదలుకొని, రైతుబంధు పెట్టుబడి సహాయం వరకు, చివరికి కనీసం విత్తనాలు అందించలేని దుర్మార్గపూరిత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. మార్పు తెస్తాం, ప్రజా పాలన అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రైతన్నలపైన లాఠీఛార్జ్ పేరుతో దాడులు చేయడమే మార్పా అని కేటీఆర్ ప్రశ్నించారు. గత పది సంవత్సరాలుగా రాష్ట్ర రైతాంగం ఎలాంటి ఆందోళన పడకుండానే విత్తనాలు, ఎరువులు, 24 గంటల ఉచిత విద్యుత్తు ఇలా తమకు కావాల్సిన అన్నింటిని సాఫీగా అందుకున్నదని తెలిపారు. కేవలం 5 నెలల్లోనే పరిస్థితి పూర్తిగా తారుమారు అయిందన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ పరిపాలన వైఫల్యం అని కేటీఆర్ మండిపడ్డారు.

వ్య‌వ‌సాయ అధికారుల‌తో స‌మీక్షకు డిమాండ్ ..

రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే రైతన్నలు పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైంది, మరోవైపు విత్తనాలు కూడా అందించలేని నిస్సహాయ స్థితికి చేరుకుందని విమర్శించారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి రైతు సమస్యలపైన దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రంలో విత్తనాల కొరత, పంపిణీ, ప్రభుత్వ వైఫల్యంపైన వెంటనే ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతన్నల కష్టాలు తొలగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈరోజు రైతన్నల పైన లాఠీ చార్జ్ చేసిన పోలీస్ అధికారుల పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రైతన్నలపైన ప్రభుత్వం ఇలా లాఠీ చార్జీల పేరుతో దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని, అవసరమైతే పార్టీ తరఫున విస్తృతమైన నిరసనగా కార్యక్రమాలు చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement