Tuesday, October 22, 2024

WGL | విద్యార్థులు ఏకాగ్రతతో వృత్తి విద్యలో నైపుణ్యాన్ని సాధించాలి

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : విద్యార్థులు ఏకాగ్రతతో వృత్తి విద్యలో నైపుణ్యాన్ని సాధించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో ముఖాముఖీ అయ్యారు. ఈ సందర్భంగా ఆధునిక శిక్షణా కేంద్రం వర్క్ షాపు నిర్మాణ పనులను పరిశీలించి డిసెంబర్ మాసం చివరి నాటికి పూర్తయ్యే విధంగా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వర్క్ షాపులో ఏర్పాటు చేయనున్న పరికరాలను పరిశీలించారు. పనులకు ప్రత్యామ్నయంగా పరికరాలు ఏర్పాటును పరిశీలించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. ఎం ఎస్ ఆఫీస్, ఫిట్టర్ ట్రేడ్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. శిక్షణా కేంద్రంలోని సౌకర్యాలు, శిక్షణా విధానాలు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ఎలా దోహదపడుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు శిక్షణలో పూర్తిస్థాయిలో మెలకువలు సాదించాలని సూచించారు. విద్యార్థులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకొని, తమ భవిష్యత్తును మెరుగు పరచుకోవాలని పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. విద్యార్థులకు శిక్షణా కేంద్రంలో అందుతున్న సదుపాయాలను, నైపుణ్యాలను అడిగి తెలుసుకుని, విద్యార్థుల స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులను ప్రవేశ పెట్టిందని, ఆధునిక శిక్షణా కేంద్రంలో 6 ట్రేడుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయుటకు అవకాశం ఉందని, మీ బంధు, మిత్రులకు తెలియచేయాలని సూచించారు.

శిక్షణా కార్యక్రమాలు, సాంకేతికతను మెరుగు పరచడంలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఐటీఐ వెనుకభాగంలో నిర్మిస్తున్న వసతి భవనాన్ని పరిశీలించి అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్ జాంలా నాయక్, ఆర్డిఓ మంగిలాల్, తహసీల్దార్ శ్రీనివాస రావు, శిక్షణా కేంద్ర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement