Saturday, September 21, 2024

Big Fight అసెంబ్లీలో రేవంత్, స‌బితా ల‌డాయి…

హైద‌రాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తనపై కక్ష ఎందుకని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సరికాదన్నారు. ‘నీ వెనుక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు… మోసం చేస్తార’ని కేటీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి అనడం సరికాదన్నారు. తాము ఏం మోసం చేశాం… ఎవరిని ముంచామో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంచి మనసుతో ఆయనను ఆహ్వానించానన్నారు.

పార్టీలోకి రా తమ్ముడు… వస్తే ఈ పార్టీకి (కాంగ్రెస్) భవిష్యత్తులో ఆశాకిరణం అవుతావని రేవంత్ రెడ్డికి చెప్పింది తానే అన్నారు. ముఖ్యమంత్రివి అవుతావని కూడా రేవంత్ రెడ్డికి ఆనాడే చెప్పానన్నారు. అలా చెప్పలేదని గుండెమీద చేయి వేసుకొని చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలో కూడా తనపై విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రతిసారి తనను టార్గెట్ చేస్తున్నారని తనపై ఇంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. ఓ ఆడబిడ్డపై ఇలాంటి మాటలు ఏమిటన్నారు. తమపై సీఎం చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

‘ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ పార్టీ నుంచి వచ్చారు? ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలో చేరారు? అక్కడున్న వారు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్లారో చర్చ పెట్టుకుందాం. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి నా ఇంటిమీద వాలితే కాల్చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని అంటూ . మరి ఇప్పుడు కెసిఆర్ పార్టీ నుంచి చేర్చుకున్న వారిలో ఎంత‌మందిని కాల్చివేశారో రేవంతే స‌మాధానం చెప్పాల‌న్నారు.

అంత‌కు ముందు స‌భ‌లో రేవంత్ మాట్లాడుతూ, సబిత నన్ను ఆశీర్వదించిన మాట వాస్తవం , అక్కగా భావించే కాంగ్రెస్‌లోకి వచ్చా న‌న్నారు. అయితే సబిత నన్ను మోసం చేశార‌న్నారు . త‌న‌ను మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయమని చెప్పార‌ని, అయితే త‌న‌కు టికెట్‌ వచ్చిన తర్వాత ఆమె బీఆర్‌ఎస్‌లో చేరార‌న్నారు. కేసీఆర్‌ మాయమాటలు నమ్మి త‌న‌ను మోసంచేశార‌ని,అందుకే త‌న‌ను మోసం చేసిన సబితను నమ్మొద్దని కేటీఆర్‌కు హిత‌వు చెప్పారు రేవంత్ .

Advertisement

తాజా వార్తలు

Advertisement