Tuesday, September 17, 2024

Revenge – మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించబోయి…..

హైదరాబాద్‌: మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించి జైలుకు పంపించేందుకు ఓ యువతి పన్నిన పన్నాగాన్ని పోలీసుల భగ్నం చేశారు… వివరాల్లోకి వెళితే.. రహమత్‌నగర్‌లో నివాసముంటున్న రింకీ.. అమీర్‌పేటలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తోంది. సరూర్‌నగర్‌కు చెందిన శ్రవణ్‌ కూడా అదే ప్రాంతంలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. ఆ తర్వాత శ్రవణ్‌ ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న రింకీ ఎలాగైనా అతడిని జైలుకు పంపి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.

పథకం ప్రకారం తన స్నేహితులతో కలిసి మంగళ్ హాట్‌లో రూ.4 వేలకు 40 గ్రాముల గంజాయి కొనుగోలు చేసింది. 8 గ్రాముల చొప్పున ఐదు ప్యాకెట్లు తయారుచేసి తన వద్ద పెట్టుకుంది. తన స్నేహితులతో శ్రవణ్‌కు ఫోన్‌ చేయించి అమీర్‌పేట సమీపంలోని ఓ పార్క్‌ వద్దకు రప్పించింది. ఆ తర్వాత రింకీ, ఆమె స్నేహితులు, శ్రవణ్‌తో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌కు వెళ్లారు. అందరూ పబ్‌లో ఉన్న సమయంలో రింకీ తనకు తెలిసిన ఓ కానిస్టేబుల్‌కు ఫోన్‌ చేసి శ్రవణ్‌ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నారు, ఫలానా నంబరు కారులో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని చెప్పింది.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారును తనిఖీ చేయగా గంజాయి పొట్లాలు లభ్యమయ్యాయి. వెంటనే శ్రవణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా కారు నాది కాదు, వేరే వాళ్ల కారులో వచ్చానని చెప్పాడు. దీంతో ఫోన్ చేసిన ఆమెను పోలీసులు విచారించడంతో అసలు గుట్టు బయటపడింది. తనను దూరం పెట్టాడనే కక్షతోనే మాజీ ప్రియుడు శ్రవణ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని రింకీనే ఇదంతా చేసిందని పోలీసులు తేల్చారు. ఈ కేసులో రింకీతో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement