Wednesday, October 23, 2024

Revanth’s Tour – తెలంగాణకు భారీ పెట్టుబడులు … రూ.839 కోట్ల పెట్టుబడికి కర్రా హోల్డింగ్ ఓకే


వీ హబ్ లో భారీ పెట్టుబడులు
మ‌హిళ పారిశ్రామిక వేత్త‌ల‌కు నిధుల వ‌ర‌ద
ముందుగాి రూ.42 కోట్ల పెట్టుబడులు
రాబోయే అయిదేండ్లలో స్టార్టప్ లలో మరో రూ.839 కోట్లు
రేవంత్ అమెరికా పర్యటనలో మరో పెద్ద కంపెనీతో ఒప్పందం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూయార్క్ – అమెరికాకు చెందిన వాల్ష్ కర్రా హోల్డింగ్స్‌ తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధపడింది. రాబోయే అయిదేండ్లలో వీ హబ్లో రూ.42 కోట్ల (5 మిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రాబోయే ఐదేళ్లలో వీ హబ్ తో పాటు తెలంగాణలో నెలకొల్పే స్టార్టప్లలో దాదాపు రూ.839 కోట్ల (వంద మిలియన్ డాలర్ల) పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. వాల్ష్ కర్రా కంపెనీకి చెందిన ఫణి కర్రా, గ్రేగ్ వాల్ష్, వీ హబ్ సీఈవో సీతా పల్లచోళ్ల ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దేశంలోనే వినూత్నంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీ హబ్ ను ఏర్పాటు చేసింది.

- Advertisement -

తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా వాల్ష్ కర్రా ప్రతినిధులను అభినందించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలే తెలంగాణ సామర్థ్యాన్ని చాటిచెపుతున్నారని, పారిశ్రామిక రంగంలో మహిళల అభివృద్ధి సమాజంలోని అసమానతలను తొలిగిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. మహిళలకు సాధికారత లేకుంటే ఏ సమాజమైనా తన సామర్థాన్యి సాధించలేదని అభిప్రాయ పడ్డారు.

వాల్ష్ కర్రా హోల్డింగ్స్ కంపెనీ అమెరికా, సింగపూర్ నుంచి పని చేస్తుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సహకారంతో పెట్టుబడిదారులు గ్రెగ్ వాల్ష్, ఫణి కర్రా దీన్ని నిర్వహిస్తున్నారు. రాబోయే శతాబ్దానికి సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించేందుకు అవసరమైన పెట్టుబడి అవకాశాలను వృద్ధి చేయాలనేది కంపెనీ సంకల్పం. కొత్త ఆవిష్కరణలు, స్థిరత్వంతో పాటు లాభదాయకమైన సంస్థలకు ఈ కంపెనీ మద్దతు ఇస్తుంది. వీటిలో పెట్టుబడులు పెట్టి కార్యకలాపాల విస్తరణతో పాటు స్థిరమైన భవిష్యత్తు నిర్మించేందుకు సహకరిస్తుంది.

వీ హబ్ తో ఒప్పందం సందర్భంగా గ్రెగ్ వాల్ష్ మాట్లాడుతూ ఈ ఒప్పందంతో మరో అడుగు ముందుకు పడిందని అన్నారు. పెట్టుబడులతో పాటు పట్టణాలతో పాటు గ్రామీణ తెలంగాణలోనూ ప్రభుత్వంతో కలిసి వివిధ కార్యకలాపాలు చేపట్టి నమ్మకమైన భాగస్వామ్యం పంచుకుంటామని ప్రకటించారు.

ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కెరీర్ ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి చేరగలిగానని, మన దేశం, రాష్ట్రం పట్ల కృతజ్ఞతను చాటుకునే అవకాశం దొరికిందని ఫణి అన్నారు. తమ పెట్టుబడులు, తమ సంస్థ భాగస్వామ్యం తప్పకుండా సానుకూల ప్రభావం చూపుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌లు రూపొందించడానికి ఈ పెట్టుబడులు ఉపయోగపడుతాయని వీ హబ్ సీఈవో సీతా పల్లచోళ్ల తెలిపారు.

గ‌ద్ద‌ర్ కు నివాళి…
కవి, గాయకుడు, సామాజిక ఉద్యమకారుడు, ప్రజా యుద్ధనౌక స్వర్గీయ గద్దర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి నివాళుల‌ర్పించారు. ఈ మేర‌కు అమెరికా నుంచి సీఎం రేవంత్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ‘రాజరికం కత్తి మీద నెత్తురుల గాయమా.. దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా..’ అంటూ పాటలతోనే పోరు బాటలు వేసిన నిఖార్సైన తెలంగాణ వాది, పొడుస్తున్న పొద్దులో వినిపించే ప్రజా విముక్తి గీతం గద్దరన్న అని ఒక సందేశంలో ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గద్దర్ పేరిట సాంస్కృతిక-సినీ అవార్డులను నెలకొల్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

జ‌య‌శంక‌ర్ సార్ కి అంజ‌లి..

తెలంగాణ సాధనే ధ్యేయంగా జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంవ‌త్ రెడ్డి ఆ మహనీయుడికి నివాళి అర్పించారు. ‘ఒకరిని యాచించడం కాదు.. ఇక్కడి ప్రజలే శాసించే తెలంగాణ కావాలి’ అన్న జయశంకర్ గారి మాటల స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, పెద్ద సారు కోరుకున్న విధంగా తెలంగాణలో ప్రజాస్వామిక సంస్కృతిని ప్రజా ప్రభుత్వం తిరిగి నిలబెట్టిందని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం కొలువైన తర్వాత మొదటి కేబినెట్ సమావేశంలో తొట్టతొలి నిర్ణయంగా జయశంకర్ సార్ స్వస్థలం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా గుర్తించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు రేవంత్ ..

Advertisement

తాజా వార్తలు

Advertisement