Thursday, October 17, 2024

Revanth vs Harish – అసెంబ్లీలో రేవంత్ – హ‌రీష్ ల మాట‌ల యుద్ధం

కౌంట‌ర్ ,ఎన్ కౌంట‌ర్ల‌తో వేడి సెగ‌లు
అప్పులు కేవలం నాలుగు ల‌క్ష‌ల కోట్లే..
తెలంగాణ‌కు స్థిరాస్థి ఇచ్చాం అన్న హ‌రీశ్
అప్పులు స‌రే..ఓఆర్ఆర్ ను ఎందుక‌మ్మారన్న రేవంత్
అమ్మ‌లా… లీజ్ కు ఇచ్చాం.. చెక్ చేసుకోండి అంటూ కౌంట‌ర్
బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ విచార‌ణ‌కు
సిద్ద‌మా అంటూ రేవంత్ ప్ర‌శ్న‌.. రెడీ అంటూ హ‌రీశ్ అన్స‌ర్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – అప్పుల విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సాగింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ నేతలు పదేపదే కేసీఆర్ హయంలో రూ.7 లక్షల కోట్ల అప్పులు అయ్యాయని అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు.

- Advertisement -

2014లో తమ ప్రభుత్వం ఏర్పడేనాటికి వారసత్వంగా రూ.72 వేల కోట్ల అప్పులు వచ్చాయని తెలిపారు. ఈ రూ.7 లక్షల కోట్ల అప్పులలో కొన్ని చెల్లించినవి కొన్ని చెల్లించనివి ఉన్నాయన్నారు. ఇలా మొత్తంగా చూసుకుంటే తాము చేసిన అప్పు రూ.4 లక్షల కోట్లకు పైగా మాత్రమే ఉంటుందన్నారు.

అయినా, తాము చేసిన అప్పుల గురించి చెబుతున్న కాంగ్రెస్ నేతలు తాము కూడబెట్టిన ఆస్తుల గురించి కూడా మాట్లాడాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు, దేవాదుల, సమ్మక్క బ్యారేజీ, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్, సుందిళ్ల భక్తరామదాసు ప్రాజెక్టు… ఇలా ఎన్నో ప్రాజెక్టులు కట్టి లక్షలాది ఎకరాలకు నీరు ఇచ్చామన్నారు. ఇదంతా తాము తయారు చేసిన ఆస్తులు కాదా? అని ప్రశ్నించారు. రైతు వేదికలు, కమాండ్ కంట్రోల్ రూమ్ ఇలా ఎన్నో నిర్మించామన్నారు.

రైతుబంధుపై రూ.72 వేల కోట్లు, రైతు రుణమాఫీకి రూ.28 వేల కోట్లు, ఆసరా పెన్షన్‌కు… ఇలా ఎన్నింటినో ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రూ.31 వేల కోట్ల రైతు రుణ మాఫీ చేస్తామని చెప్పిందని, కానీ దానిని రూ.25 వేలకు తగ్గించిందని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం సంతోషమేనని… కానీ వైద్య శాఖకు నిధుల కేటాయింపు తగ్గిస్తే ఇది ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. అలాగే కేసీఆర్ పేరు నచ్చకుంటే పేరు మార్చి కిట్లు ఇవ్వాలని సూచించారు. కానీ రాజకీయాల కోసం పేదల కడుపు కొట్టవద్దని సూచించారు. ఆరు గ్యారెంటీలపై బాండ్ పేపర్ ఇచ్చి మరీ మోసం చేశారని మండిపడ్డారు. బాండ్ పేపర్ వ్యాల్యూ తీసేశారన్నారు.

ఇక నాన్ ట్యాక్స్ రెవెన్యూలో రూ.35వేల కోట్లు వస్తుందని బడ్జెట్‌లో పెట్టారని తెలిపారు. గతంలో రుణమాఫీ కోసం భూములు అమ్మితే భట్టి, శ్రీధర్ బాబు విమర్శించారని.. ఇప్పుడు రూ.10 వేల కోట్ల భూములు అమ్మి నిధులు సమీకరిస్తామని చెప్పారని తెలిపారు. రూ.24వేల కోట్లు అదనంగా ఎలా తీసుకువస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీ మాటపై గౌరవం ఉంటే భూములు అమ్ముకునే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలన్నారు.


సాధ్యం కానీ తరహాలో ఆదాయం ఎక్కువ చూపారన్నారు. తప్పనిసరి ఖర్చులను తక్కువ చేసి చూపారని ఆక్షేపించారు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారని.. కానీ బడ్జెట్‌లో రూ.26వేల కోట్లు మాత్రమే వస్తోందన్నారు. రుణమాఫీ ఇవ్వడం ఆలస్యం అయిందని రైతుల నుంచి బ్యాంకర్లు వడ్డీ వసూలు చేస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం రుణమాఫీ ఆలస్యం చేసి రైతులపై భారాన్ని మోపుతుందని సీరియస్ అయ్యారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తాము కొనసాగించామని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్‌లాంటి పథకాల పేర్లు మార్చి పంపిణీ చేసినా త‌మ‌కు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

అప్పుల లెక్కలు చెప్పి… అమ్మకాల లెక్కలు చెప్పడం లేదు

హరీశ్ రావు అప్పుల లెక్క చెప్పే సమయంలో అమ్ముకున్న లెక్కలు ఎందుకు చెప్పడం లేదని సీఎం రేవంత్ నిలదీశారు. ప్రాజెక్టులు కట్టినందుకు అప్పులు అయ్యాయని చెబుతున్న మాజీ మంత్రి. భూములు అమ్మిన విషయం ఎందుకు చెప్పలేదన్నారు. లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్‌ను రూ.7 వేల కోట్లకు అమ్మారని ఆరోపించారు. రూ.700 కోట్ల గొర్రెల పంపిణీలో భారీ అక్రమాలు జరిగాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇటీవల రూ.80 వేల కోట్లు ఖర్చు చేశామన్న బీఆర్ఎస్, ఇప్పుడు రూ.94 వేల కోట్లు అంటోందని విమర్శించారు.


అయితే తాము ఓఆర్ఆర్‌ను విక్రయించలేదని, అది తిరిగి ప్రభుత్వానికే వస్తుందని హరీశ్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.94 వేల కోట్లు ఖర్చయ్యాయని తాము మొదటి నుంచీ చెబుతున్నామన్నారు. బతుకమ్మ చీరలపై అసత్యాలు చెప్పి మహిళలను అవమానించారని, ఇందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదా రికార్డ్స్ నుంచి తొలగించాలని కోరారు.

వాటిపై విచారణకు సిద్ధమా?

2006లో కేసీఆర్ వస్తే పాలమూరు ప్రజలు ఆదరించి గెలిపించారని ముఖ్యమంత్రి అన్నారు. మరి పదేళ్లలో పాలమూరు ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలోని భూములు.. ఆస్తులు అమ్ముకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేవెళ్ల ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అబద్ధాలు చెబితేనే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని, లోక్ సభ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిజాయతీగా పాలన చేసి ఉంటే… బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ మీద విచారణకు సిద్ధమా? అని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement