Thursday, September 19, 2024

Revanth America Tour – మేరీ జాన్‌ అమెజాన్! ఇక‌ మీద‌ట వెబ్ సర్వీసెస్

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు.. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. కాగా, తెలంగాణలో డేటా సెంటర్ కార్యకలాపాలపై వారితో చర్చలు జరిపారు.

ఇప్పటికే తెలంగాణలో అమెజాన్ కంపెనీ కార్యకలాపాలను విస్తరించింది. ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్పొరేట్ భవనం హైదరాబాద్‌లో ఉంది. గత ఏడాది అమెజాన్ డెడికేటేడ్ ఎయిర్ కార్గో నెట్‌వర్క్ ‘అమెజాన్ ఎయిర్’ ప్రారంభించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు (AWS) సంబంధించి హైదారాబాద్‌లో మూడు డేటా సెంటర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి.

వ్యాపార విస్త‌ర‌ణ‌కు స‌న్నాహాలు..అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్‌తో పాటు తమ వ్యాపారాన్నివిస్తరించే ఆలోచనలను ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు పంచుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అమెజాన్‌తో చర్చలు విజయవంతమయ్యాయని ప్రకటించారు. ప్రభుత్వం తరఫున తగినంత సహకారంతో పాటు ఉత్తమమైన ప్రోత్సాహకాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో భారీ విస్తరణకు కంపెనీ మందుకు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

డిజిట‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో భాగం అవుతాం..

అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో తమ క్లౌడ్ సదుపాయాలను మరింత విస్తరించే అవకాశాలపై ఆనందం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ క్లౌడ్ సేవల వృద్ధికి హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ వృద్ధిలో ఆశించిన లక్ష్యాలను అందుకునేందుకు తమ కంపెనీ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement