Tuesday, July 9, 2024

Respond – ఆమె ఓ బ్లాక్ మెయిల‌ర్ …. మోసం కేసులో స్పందించిన రాజ్ త‌రుణ్

హైద‌రాబాద్ – ఆంధ్ర‌ప్ర‌భ – హీరో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ అతడి ప్రియురాలు లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీనిపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు. ఇందులో తన తప్పేమీ లేదని, అందుకే ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. ఆ అమ్మాయిని తాను మోసం చేశాననడంలో నిజంలేదని అన్నారు.

అయితే, లావణ్యతో తాను రిలేషన్ లో ఉన్నది నిజమేనని, 2014 నుంచి 2017 వరకు తాము సంబంధంలో ఉన్నామని రాజ్ తరుణ్ వెల్లడించారు. ఆ తర్వాత తమ మధ్య ఎలాంటి శారీరక సంబంధం కానీ, మరే ఇతర సంబంధాలు కానీ లేవని స్పష్టం చేశారు. కానీ, లావణ్య తనను బెదిరిస్తుండేదని, అయితే తాను పరువు కోసం ఇవన్నీ భరించానని తెలిపారు. ఆ తర్వాత ఆమె డ్రగ్స్ వాడడం మొదలుపెట్టిందని, ఆమెపై డ్రగ్స్ కేసు కూడా ఉందని వివరించారు.

- Advertisement -

ఆ డ్రగ్స్ కేసు కూడా తాను పెట్టించానని ఆమె ఆరోపించింది… మరో అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుని ఆ విషయంలో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది… దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ను కూడా తాను సేకరించాను అని రాజ్ తరుణ్ వివరించారు.

అతడి పేరు మస్తాన్ సాయి… లావణ్యను చావగొట్టాడు… అతడిపై కేసు పెట్టి, మళ్లీ అతడితోనే ఉంటోంది… అది కూడా నా ఇంట్లో! నేను ఆ ఇంట్లోంచి బయటికి వచ్చేశాను. ఎందుకంటే… ఆమె అలవాట్లు, చేసే పనులు, ఆమె బుద్ధి ఏ రకంగానూ సమర్థనీయం కాదు… ఆమెది బ్లాక్ మెయిల్ చేసే స్వభావం అని ఆరోపించారు.

ఇక, తాను లావణ్యను గుడిలో పెళ్లి చేసుకున్నానని చెప్పడం పచ్చి అబద్ధం అని రాజ్ తరుణ్ కొట్టిపారేశారు. ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన నిజం ఏమిటంటే నేను జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను అని వెల్లడించారు. ఒకవేళ భవిష్యత్ లో పెళ్లి చేసుకోవచ్చేమో కానీ, ఇప్పటివరకు అయితే పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేశారు.

ఓసారి తాను పుట్టినరోజును ఇంటిపట్టునే ఉండి సెలబ్రేట్ చేసుకుందామనుకుంటే, లావణ్య తదితరుల గోల భరించలేక వాళ్లను తానే గోవా తీసుకెళ్లాల్సి వచ్చిందని రాజ్ తరుణ్ వాపోయారు. అక్కడ వాళ్లందరూ డ్రగ్స్ తీసుకున్నారని, తాను మాత్రం డ్రగ్స్ జోలికే వెళ్లలేదని స్పష్టం చేశారు. నాకు డ్రగ్స్ అలవాటు లేదన్న విషయం కాలర్ ఎగరేసి మరీ చెబుతానని అన్నారు.

ఆమె నాకు ఎంతో హెల్ప్ చేసింది.

తాను మొదట్లో షార్ట్ ఫిలింస్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు లావణ్య తనకు పరిచయం అయిందని, అప్పట్లో తనకు చాలా సహాయం చేసిందని రాజ్ తరుణ్ చెప్పారు. మొదట్లో లావణ్య చాలా మంచి అమ్మాయని, తనకు చాలా సాయపడిందని, ఆ కృతజ్ఞతా భావంతోనే ఆమె ఎన్ని చేసినా భరించానని తెలిపారు. క్రమంగా ఆమెకు చెత్త స్నేహితులు ఏర్పడ్డారని, అప్పుడే ఆమె నుంచి విడిపోదామని భావించానని, కానీ ఆమె ప్రతిదానికీ మీడియా ఎదుటకు వెళతాను, కంప్లెయింట్ చేస్తాను అని బెదిరించేదని వివరించారు.

ఇక, కొత్త హీరోయిన్ మాల్వీ మల్హోత్రాకు, తనకు లింకు పెడుతూ లావణ్య చేసిన ఆరోపణలపైనా రాజ్ తరుణ్ బదులిచ్చారు. మాల్వీ మల్హోత్రా తనకు చాలా మంచి ఫ్రెండ్ అని వెల్లడించారు. లావణ్య ఎన్ని అబద్ధాలైనా , ఏమైనా చెబుతుందని మండిపడ్డారు. మాల్వీ మల్హోత్రా సినిమా షూటింగ్ లకు హైదరాబాద్ వస్తే ఆమెకు నేనెందుకు ఆశ్రయం కల్పిస్తాను? అని రాజ్ తరుణ్ ప్రశ్నించారు. లావణ్యకు తన డబ్బులు కావాలని, తాను అక్కర్లేదని, అందుకే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement