Friday, October 18, 2024

Rains & Floods – మరో మూడు రోజుల దంచుడే.., కలెక్టర్లను అప్రమత్తం చేసిన సి.ఎస్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైదరాబాద్, :: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించినందున అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం సమీక్షిస్తున్నారని, జిల్లాల్లో ఏవిధమైన ప్రాణ నష్టం తోపాటు ఆస్తి నష్టం కూడా కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముందుగానే, పునరావాస కేంద్రాల ఏర్పాటు పై చర్యలు తీసుకోవాలని, పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, అగ్నిమాపక శాఖ, NDRF, SDRF తదితర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు.

సచివాల‌యం నుంచి సిఎస్ నేడు జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో టెలికాన్ష్ రెన్స్ నిర్వ‌హించారు.. డీజీపీ జితేందర్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా లు కూడా ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల పలు చెరువులు, కుంటలు నిండాయని, అవి తెగకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని అన్నారు. ఇప్పటికే, ముందస్తు జాగ్రత్తలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఏదైనా అత్యవసర సహాయం కావాలన్నా తమను ఏ సమయంలో నైనా సంప్రదించాలని జిల్లా కలెక్టర్లకు సి.ఎస్ సూచించారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు, చెరువు కట్టలు తదితర ప్రాంతాల వద్ద జాగ్రత చర్యలు చేపట్టాలన్నారు. పారే వాగులను ఎవరూ దాటకుండా ఆయా ప్రాంతాలలో తగు బందో బస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.

- Advertisement -

డీజీపీ జితేందర్ మాట్లాడుతూ, రాష్ట్రం లోని అందరు పోలీస్ కమీషనర్లు, ఎస్.పీ లు జిల్లా కలెక్టర్ తోపాటు ఇతర ప్రభుత్వ అధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నారని తెలియచేసారు. ఇప్పటివరకు ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరుగలేదని, పోలీస్ అధికారులందరూ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా మాట్లాడుతూ, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుండి, భారీ వర్షాలతో పాటు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కురిసే అవకాశముందని తెలిపారు. భద్రాచలం వద్ద ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక ను ప్రకటించామని, 53 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్టు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అన్నారు. ఇప్పటికే జిల్లాల్లో దెబ్బతిన్న నివాస గృహాలు, ఇతర నష్టాలపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఏవిధమైన అనుకోని సంఘటలు ఎదురైతే, ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ ఎప్‌, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని తెలియచేసారు. అన్ని మండలాలలో మండలాల వారీగా అధికారుల బృందాలను ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉన్నామని ములుగు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతీ గ్రామంలో ప్రత్యేకంగా ఒక సమాచార అధికారిని గుర్తించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అన్నారు. దాదాపు వంద కిలోమీటర్ల విస్తీర్ణంలో ములుగు జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతం ఉందని, 77 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి ముందస్తు జాగ్రత్తలను చేపట్టామని వివరించారు. జిల్లాల వారీగా వరదలు, వర్షాల ప్రభావం పై సి.ఎస్, ఆయా జిల్లాల కలెక్టర్ల, ఎస్పీలు, పోలీస్ క‌మిష‌న‌ర్ల తో సమీక్షించారు.

క్షేత్రస్థాయి అధికారులంతా తమతమ ప్రాంతాల్లో అందుబాటులో ఉండి పరిస్థితికనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాలని, వీలైనంత వేగంగా స్పందించాలని కోరారు. ఎలాంటి అలసత్యం దృష్టికి వచ్చిన తగు చర్యలుంటాయని పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement