Monday, September 16, 2024

Protest – కెటిఆర్ , హారీష్ తో స‌హా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్ – వీడియోతో

అరెస్ట్ అయిన వారిలో కెటిఆర్,హారీష్ లు
సిఎం వ్యాఖ్య‌లపై అసెంబ్లీ వెల్ లో బైఠాయింపు
స్పీక‌ర్ ఆదేశాల‌తో అంద‌ర్నిబ‌య‌ట‌కు
లాక్కెళ్లిన మార్ష‌ల్స్
అక్క‌డ కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నినాదాల హోరు
అరెస్ట్ చేసిన వాహ‌నంలో అక్క‌డి నుంచి త‌ర‌లించిన పోలీసులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నేడు సీఎం ఛాంబర్‌ ఎదుట ధర్నాకు దిగారు. మహిళలను అవమానపరిచన సీఎం రేవంత్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అనంత‌రం నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీలో వెల్‌లో బైఠాయించగా మార్షల్‌ వారిని అసెంబ్లీ వెలుపలకు తీసుకువచ్చారు. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేసి వాహనంలో అసెంబ్లీ నుంచి తరలించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, పద్మారావు గౌడ్‌తో పాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్‌ జాదవ్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురి సభ్యులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు…

విప‌క్ష గొంతు నొక్కేస్తున్నారు….

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. శాసనసభలో విపక్షం గొంతునొక్కారన్నారు. ఎన్నిసార్లు కోరినా స్పీకర్‌ మైక్‌ ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇన్ని ఆంక్షలు లేవని, తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు శాసనసభలో చూడడం దురదృష్టకరమన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందన్నారు. ముమ్మూటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని.. అప్పటి వరకు విడిచిపెట్టేది లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ కేటీఆర్‌ నినదించారు.

కొన‌సాగుతున్న‌స‌బితా,సునీతాల నిర‌స‌న

- Advertisement -

మరోవైపు శాసనసభలో మూడుగంటలుగా నిల్చొని ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కోవ లక్ష్మి, సునీతా లక్ష్మారెడ్డి నిరసన తెలిపారు. సీఎం క్షమాపణలు చెప్పే వరకు నిరసన కొనసాగిస్తామని బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement