Monday, September 30, 2024

Press Meet – ఇల్లంటే జీవితకాల కష్టానికి ప్రతిరూపం … వాటిని కూలుస్తుంటే అడ్డుగా నిల‌బ‌డ‌తాం – కెటిఆర్

హైద‌రాబాద్ – తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్‌ ఏదేదో చెప్పిందని.. తీరా అధికారంలోకి వచ్చాక ఇంకేదో చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. మూసి బాధితుల పాలిట కాలయముడిలా సీఎం రేవంత్‌ రెడ్డి తయారయ్యార‌ని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూసీ సుందరీకరణ దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని మరోసారి ఆరోపించిన ఆయన.. హైడ్రా బాధితుల తరఫున పోరాడి తీరతామని ఉద్ఘాటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారాయన.

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? ఇప్పుడు ఏం చేస్తోంది?. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంది. కళ్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం అని ప్రకటించింది. ఎన్నికల ముందు తెలంగాణలో చక్కర్లు కొట్టిన రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లారు అంటూ ప్ర‌శ్నించారు.

హైదరాబాద్ నగరంతో పాటు సూర్యాపేట,ఆదిలాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. పేదల ఇల్లు కూల్చి పెద్దలకు లాభం చేయమని ఏ ఇందిరమ్మ,సోనియమ్మ చెప్పింది. వరి సాగులో తెలంగాణ టాప్ గా నిలిచింది ఇది కాళేశ్వరం ఘనత కాదా?. 2016లో బీఆర్ఎస్ హయాంలో చెరువులు, బఫర్, ఎఫ్.టి.ఎల్ డ్రా చేస్తూ జీవో ఇచ్చాం. మూసీలో మేము పేదల కడుపు కొట్టకుండా బ్యూటిఫికేషన్ చేశాం. ఎస్.టి.పి లు మేము పూర్తి చేశాం. మేము నిర్మాణం చేస్తే మీరు విధ్వంసం చేస్తున్నారు అంటూ పేర్కొన్నారు.

మూసీ కోసం లక్షా 50 వేల కోట్లా?
తెలంగాణలో లంకెబిందెలు లేవని అంటున్నారు. మరి మూసీ అభివృద్ధి ఏం ఆశించి చేస్తున్నారు?. మరోవైపు మూసీకి లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెడతామని అంటున్నారు. 2,400 కిలోమీటర్ల గంగానది ప్రక్షాళనకు పెట్టిన బడ్జెట్ 40 వేల కోట్లు. సబర్మతి రివర్ ప్రాజెక్టుకు 7,000 కోట్లు ఖర్చు అయింది. యమునా రివర్ ప్రాజెక్టుకు ఖర్చు అయింది వెయ్యి కోట్లు. అలాంటిది 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణ కోసం లక్షా 50 వేల కోట్లు ఖర్చు అవుతుందని సీఎం రేవంత్‌ అంటున్నారు. మూసీ సుందరీకరణ కాంగ్రెస్ పార్టీకి రిజర్వ్ బ్యాంకులాగా ఉందా?. మూసీ ప్రాజెక్టుతో మురిసేది ఎంతమంది?. మూసీ సుందరీకరణతో ఒక్క ఎకరానికి అయినా నీళ్లు వస్తాయా?. ఇది స్కామ్ కాక మరి ఏం అవుతుంది.

ఇల్లంటే జీవితకాల కష్టానికి ప్రతిరూపం
‘సీఎం ఒకమాట అర్థం చేసుకోవాలి. ఒక పేద, మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది జీవితకాలం వారు చేసిన కష్టానికి ప్రతిరూపం. ఇల్లు అనేది ఒక ఎమోషన్‌. ఇల్లు అనేది ఆ కుటుంబం కలలుగనే ఒక సౌధం. అది ఒక నాలుగు ఇటుకలు, రెండురాళ్లు పెట్టిన కట్టిన కట్టంకాదు. ఇల్లు జ్ఞాపకాల పొదరిల్లు. అలాంటి జ్ఞాపకాన్ని కూల్చేస్తామంటే ఆ బాధ మీకు తెలియది కావచ్చు రేవంత్‌రెడ్డి. కానీ, మాకు తెలుసు. స్వయంగా కేసీఆర్‌ కుటుంబం రెండుసార్లు డిస్‌ప్లేస్‌ అయ్యాం. మా నాయనమ్మ ఊరు పోసాన్‌పల్లి. ఎగువ మానేరు డ్యామ్‌లో 1940లో మునిగిపోతే అక్కడి నుంచి తట్టాబుట్ట పట్టుకొని చింతమడకకు వచ్చింది మా కుటుంబం. మా అమ్మమ్మగారి ఊరు మొన్న మిడ్‌మానేరులో 2014 తర్వాత మా ప్రభుత్వంలో మునిగిపోయింది.

- Advertisement -

మా జ్ఞాపకాలు అందులోనే మునిగిపోయినయ్‌. ఒకసారి కాదు.. రెండుసార్లు డిస్‌ప్లేస్‌ అయినం. మాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. ఒకసారి నిర్వాసితులుగా మారితే ఊరుతో అల్లుకున్న జ్ఞాపకాలు.. ఆ ఇంటితో అలుముకున్న కొన్ని ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉంటాయో మాకు తెలుసు.. రేవంత్‌రెడ్డికి తెలియకపోవచ్చు. మీలాగా ఆయాచితంగా.. లక్కీడ్రాలో వచ్చినట్లు దన్‌మని ఊడిపడలేదు. ప్రజలు కష్టపడి కట్టుకున్నారు. ఇవాళ మీరు సీఎంగా ఉన్నారు కావొచ్చు కానీ.. మీ కాంగ్రెస్‌ ప్రభుత్వమే అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న ఇండ్లు ఇవీ. 20, 30, 40 ఏళ్ల రెక్కల కష్టంతోని ఇండ్లు. పట్టాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఇంటినంబర్లు ఉన్నాయి. కరెంటు బిల్లు ఉన్నయ్‌. నల్లా బిల్లులు ఉన్నయ్‌. చట్టరీత్యా అన్నిరకాలుగా న్యాయమైన పూర్తిస్థాయిలో ప్రభుత్వం గుర్తించిన ఇండ్లు’ అన్నారు. 1994 లో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిందని భాదితులు అంటున్నారు.అలాంటప్పుడు లక్షమంది ప్రజలను నిరాశ్రయులను చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారు?. ఇళ్లు కూలగొడుతుంటే ప్రజలు ఊరుకుంటారా?. లక్షలాది మంది జీవితం నాశనం చేస్తున్నారు. వాళ్లు తిర‌గ‌బ‌డ‌క‌ముందే మేల్కొండి అంటూ కెటిఆర్ హిత‌వు ప‌లికారు

సెక్రటేరియేట్‌ కూడా కూలుస్తారేమో!
హైడ్రా దెబ్బకు రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. ఎవరి కోసం హైడ్రా తీసుకొచ్చారు?. పేదల ఇళ్లు కూల్చాలని ఎవరు చెప్పారు?. ప్రభుత్వ వైఖరితో పేదలు ఇబ్బంది పడుతున్నారు. కూల్చాల్సి వస్తే ముందు హైడ్రా ఆఫీస్‌నే కూల్చాలి. రెండోదిగా జీహెచ్ఎంసీ ఆఫీసును కూల్చాలి. నాలాపై ఉన్న జీహెచ్‌ఎంసీ ఆఫీసును కూలుస్తారా?. ఎఫ్.టి.ఎల్ లో సెక్రటేరియట్ ఉందని రేవంత్ రెడ్డి కూలుస్తారేమో అని అనుమానం ఉంది. కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యం. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇళ్లు కూలగొడుతున్నారు. మంత్రులు ఎందుకు మూసీ గురించి చెప్పడం లేదు. అధికారుల వెనక దాక్కుని కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పటి వరకు మూసీ సుందరీకరణపై డి.పి.ఆర్ రెడీ కాలేదు. డి.పి.ఆర్ రెడీ కాకుండా ఇళ్ళు ఎందుకు కూలగొడుతున్నారు అంటూ నిల‌దీశారు.

చట్ట ప్రకారం నడుచుకోవాలని హైడ్రా కమిషనర్ కు చెప్పిన తెలంగాణ హైకోర్టుకు ధన్యవాదాలు. బీఆర్‌ఎస్‌ లీగల్ సెల్ ఇప్పటికే లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఇప్పటికే మా నేతలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. పొరపాటున కాంగ్రెస్ వాళ్లు మూసీ బాధితుల వద్దకు వెళ్లవద్దు.బాధితులకు మేం అండగా నిలబడతాము. బాధితులకు కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్తాము. సాగరహారం లాంటి ధర్నాలు తెలంగాణలో వచ్చే విధంగా ఉన్నాయని అన్నారు కెటిఆర్

సావాస దోషంతోనే మంత్రి మాటలు
5 వేల రూపాయలకు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్‌బాబు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ లాగా పీసీసీ పదవిని అమ్ముకోవడం,సీఎం పదవిని అమ్ముకోవడం తెలంగాణ ప్రజలకు రాదు. సావాస దోషంతో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.రేవంత్ రెడ్డికి లక్కీడ్రాలో ముఖ్యమంత్రి పదవి వచ్చింది. 50 కోట్లకు పీసీసీ పదవీ , 500 కోట్లకు సీఎం పదవీ నీ కాంగ్రెస్ అమ్ముకుంది అంటూ ఆరోపించారు కెటిఆర్

ముందు నీ ఇలు , నీ సోద‌రుడి ఇల్లు కూల‌గొట్టు…

సీఎం రేవంత్ రెడ్డి ఇంటి నుండి వచ్చే మురికినీరు ఎక్కడికి పోతుందో రేవంత్ రెడ్డికి తెలుసా?. కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇళ్ళు కుంటలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి నివాసం ఎఫ్.టి.ఎల్ లో ఉంది. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నీ సోదరుడి ఇళ్ళు కూలగొట్టు.

ఈ రోజు ఆక్రమణలంటున్నారు కదా.. ఎవరైనాతో నాడు పర్మిషన్‌ ఇచ్చారో ఆనాడు.. ఎవరైనా అధికారులు.. ప్రభుత్వాలున్నాయో వారిపై చర్యలు తీసుకో. 2016లో వచ్చి జీవో ఇచ్చే వరకు మీ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదు నేను అడుగుతున్నా. అన్నింటికి మంచి లక్షలాది మంది జీవితాలు అంధకారం చేస్తాననంటే ఊరుకోం. ఒక్కమాట అడుగుతున్నా ముఖ్యమంత్రిని.. మీ ప్రాధాన్యం ఏంటీ అసలు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటవా..? ప్రజలకు ఇచ్చిన మాట ఏందీ? రైతులకు రైతుభరోసా అన్నారు.. రైతుకూలీలకు నెలకు రూ.1000 ఇస్తామన్నారు. ఆటోడ్రైవర్లను బాగా చేసుకుంటాం అన్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు.. నెలకు రూ.2500 ఇస్తానన్నావ్‌. ఏదీ చేయకపోగా.. వాటికి పైసలు లేవట. చేతులు రావు.. మనసు రాదు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పింఛన్లు పెంచారు. తెలంగాణలో పింఛన్లు ఎందుకు పెంచలేదు. రైతులకు ఇప్పటి వరకురైతు భరోసా ఇవ్వలేదు. ముందు వంద రోజుల్లో చేస్తామని చెప్పిన హామీలు రేవంత్ రెడ్డి అమలు చేయాలి. కానీ రూ.1.50లక్షల కోట్లు ఒక మూసీ ప్రాజెక్టుకు వెచ్చిస్తున్నారు’ అంటూ ధ్వజమెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement