Thursday, September 12, 2024

NZB: రైతు ఆందోళనకు మా మద్దతు… ధర్మపురి అరవింద్

నిజామాబాద్ ప్రతినిధి, ఆగస్టు 23( ప్రభ న్యూస్) : సాధ్యం కానీ హామీలను ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై, రుణమాఫీపై రైతులు చేపడుతున్న ఆందోళనకు త‌మ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ… ఎన్నికల్లో సాధ్యం కాని హామీలను ఇచ్చి రైతులను, మహిళలను, యువతను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని ధ్వజమెత్తారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి కేవలం 30శాతం మంది రైతులకు రుణమాఫీ చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తి అని ఎద్దేవా చేశారు.

జేబులు నింపుకోవడం తప్ప ప్రజా సంక్షేమంపై శ్రద్ధ లేదని మండిపడ్డారు. గత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రుణమాఫీ చేసిన తీరు అభినందనీయమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల్లో రేవంత్ రెడ్డి సర్కారుపై రోజురోజుకీ అసహనం పెరిగిపోతుందన్నారు. వడ్డీలేని రుణాలు ఇచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ చిప్ప చేతికిచ్చిందని విమర్శించారు. కేసీఆర్ లాగే రేవంత్ కూడా అబద్ధాలు చెబుతూ కాలం వెళ్ళదీస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ ఆంక్షలు లేని రుణమాఫీని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు సంక్షేమాన్ని మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ‌ చేపడుతున్న ఆందోళనకు త‌మ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, నాయకులు తిరుపతి రెడ్డి, పోతాన్కర్ లక్ష్మీనారాయణ, బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement