Friday, September 20, 2024

TG: నక్సల్స్ ఘాతుకం… మహిళ దారుణహత్య…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. మావోయిస్ట్ లు ఘాతుకానికి పాల్పడ్డారు.. ఇన్ఫార్మర్ నేపంతో మహిళను దారుణంగా హత్య చేశారు.
చర్ల మండలంలోని చెన్నాపురం అడవి ప్రాంతంలో ఇవాళ‌ ఉదయం ఈ ఘటన జరిగినట్లు సమాచారం.. మావోయిస్టులు రాధ‌ను హ‌త్య చేశారు. ఈసంద‌ర్భంగా ఆమె మృత‌దేహం వ‌ద్ద మావోయిస్టులు ఓ లేఖను వ‌దిలివెళ్లారు. ఆ లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది…

‘ ప్రియమైన ప్రజలారా!
మన పార్టీ, విప్లవోద్యమ చరిత్రలో శతృవు పార్టీ నాయకత్వాన్ని ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని కోవర్టు కుట్రల ద్వారా నిర్మూలించాలని గతంలో అనేక ప్రయాత్నాలు చేసాడు. పార్టీ శ్రేణులను, ప్రజలను చైతన్యపర్చడం, అప్రమత్తం చేయడం ద్వారా శతృవు లక్ష్యాన్ని అనేక సందర్భాలలో విఫలం చేసాం. గత కొంత కాలంగా తెలంగాణ, ఏపీ, చత్తీస్ ఘడ్ పోలీసు ఇంటలిజెన్సీ ఉన్నతాధికారుల నేతృత్వంలో పార్టీలో రాజకీయంగా బలహీనపడిన కొందరిని కోవర్టులుగా ఆర్గనైజ్ చేసి పార్టీకి భారీ నష్టాన్ని కలుగజేయాలని పథకరచన చేసారు. పార్టీ పరిశీలన, అప్రమత్తత ద్వారా ఈ కుట్రను పసిగట్టి భగ్నం చేసింది.

ఈ కోవర్టు కుట్రలో భాగస్వాములైన విప్లవ ద్రోహులను విచారించి పార్టీ, ప్రజల ఆమోదంతో వారికి తగిన శిక్షలు విధించడం
జరిగింది. అందులో భాగమై విప్లవద్రోహిగా మారిన నీలో(బంటి రాధ)ను కూడా విచారించగా మొత్తం శతృవు కుట్రను, ఇందులో
తన పాత్రను అంగీకరించింది. రాధ హైద్రాబాద్ లోని బాలాజీనగర్, అంబేడ్కర్ నగర్ (న్యూ ఇందిరానగర్ కు చెందిన బంటి బాలయ్య, బాలమ్మల కుమార్తె. ఆమె ఇంటర్ వరకు చదువుకొని, డీ.ఎమ్.ఎల్.టి పూర్తిచేసి 2018లో విప్లవ రాజకీయాలను విశ్వసించి స్వచ్ఛందంగా విప్లవోద్యమంలో చేరింది. గడిచిన 6 సంవత్సరాల కాలం ఏ.ఓ. బీలోనే తన విప్లవ కార్యాచరణను కొనసాగించింది. పార్టీ సభ్యురాలిగా, జోన్ మిలటరీ ఇన్స్ట్రక్టర్గా, నాయకత్వ రక్షణాదళం కమాండర్ గా బాధ్యతలు నిర్వర్తించింది. ఈ ఎదుగుదలతో పాటు మొదటి నుండి కొన్ని బలహీనతల్ని కూడా కలిగి ఉన్నది. పెళ్ళి, స్త్రీ-పురుష సంబంధాల విషయంలో పార్టీ పద్ధతులకు లోబడకుండా వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. క్రమంగా నిజాయితీగా ఉండకపోవడం, పార్టీని కొన్ని విషయాలలో పక్కదారి పట్టించడం చేస్తూ వచ్చింది. దానితో పార్టీ గత 3 నెలల క్రితం తనను కమాండర్ బాధ్యతల నుండి సస్పెండ్ చేసింది. ఆమె విప్లవాన్ని ఇష్టపడింది, కోరుకున్నది కానీ అందుకనుగుణంగా తననితాను తీర్చిమలుచుకోవడంలో విఫలమైన ఫలితంగానే చివరకు తన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేక ఆమె విప్లవ జీవితం రాజకీయ పథనానికి దారి తీసింది.

- Advertisement -


నీలో ఉద్యమంలో చేరిన తర్వాత మొదట ఆమెను పార్టీ నుండి బయటికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులపై పోలీసులు
తీవ్రమైన ఒత్తిడి చేసారు. ఈ క్రమంలో రాధ తమ్ముడు సూర్యంకు ఉద్యోగం, డబ్బులు, విలాసవంతమైన జీవితం ఆశలు చూపగా
పోలీసులకు లొంగిపోయి వారికి పూర్తిగా సహకరించడానికి సిద్ధపడి ఏజెంటుగా మారాడు. అప్పటి నుండి రహస్యంగా పోలీసు
ఇంటలిజెన్సీ విభాగంలో పనిచేస్తూ వారి ప్రోద్భలంతో తనతోపాటు నిరుద్యోగ, లంపెన్ యువతను కొందరిని ఆర్గనైజ్ చేయడం.
ప్రారంభించాడు. అందులో ప్రీతి, రాజు, సురేష్, రాజులతో కలిపి ఒక టీం ఏర్పడింది. ఇలా ఏర్పర్చిన మరికొన్ని టీమ్లతో పార్టీ
సానుభూతిపరుల, విప్లవాభిమానుల, ప్రజాసంఘాల కార్యకర్తల కదలికలపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ దాడులు చేస్తున్నారు. అందుకు పోలీసులు వీరికి పెద్దమొత్తంలో డబ్బుల్ని ఇస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కొద్ది నెలల క్రితం రాధ ఫోన్ నెంబర్ను దొరికించిన పోలీసులు మొదట గతంలో తన సన్నిహిత స్నేహితురాలైన మమత ద్వారా ఫోన్ చేయించి, ఆమెను బలహీనపర్చి ఉద్యమం నుండి బయటకు తీసుకురావాలని ప్రయత్నించారు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో తర్వాత కుటుంబ సభ్యులను చంపుతామనీ, జైళ్ళో పెడతామని బెదిరించి లొంగదీసుకున్నారు. తర్వాత రాధ తమ్ముడు సూర్యం ద్వారా ఆమెకు ఫోన్ చేయించారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, ఘర్షణలు, తల్లి అనారోగ్యం, తన నిరుద్యోగ సమస్యలు ముందు పెట్టి ఉద్యమం నుండి బయటకు రావడంగాని లేక పార్టీలోనే ఉంటూ తాను కోరిన పార్టీ సమాచారాన్ని ఇవ్వడం ద్వారా పై సమస్యలు పరిష్కారమవుతాయని ఆమెతో మాట్లాడాడు. అందుకు ఆమె సిద్ధపడి అప్పటి నుండి తెలంగాణ, చత్తీస్గడ్ పోలీసు ఇంటలిజెన్సీ అధికారుల సంబంధంలో ఉంటూ వారు కోరిన విధంగా నాయకత్వపు, పార్టీ కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తూ వచ్చింది.


నాయకత్వ నిర్మూలన కోసం పోలీసులు రూపొందించుకున్న భారీ పథకాన్ని అమలు చేయడానికి పార్టీలో కొంతకాలం నుండి పని చేస్తున్న కొందరు కోవర్టులతో ఈమెను కలిపి ఒక టీంగా పని చేసే విధంగా గైడ్ చేసాడు. సకాలంలో పోలీసుల కుట్రను పార్టీ
పరిశీలన, అప్రమత్తత ద్వారా గుర్తించి విప్లవ ద్రోహులను విచారించి శతృవు కుట్రను విఫలం చేయగలిగింది. విప్లవ ద్రోహులను
పార్టీ, ప్రజల ఆమోదంతో కొందరిని పార్టీ నుండి బహిష్కరించగా, మరికొందరికి మరణశిక్ష విధించాలని నిర్ణయించింది. అందులో
భాగంగానే నీలోపై కూడా మరణశిక్ష విధించాం. దోపిడీవర్గాలు తమ చేతికి మట్టి అంటకుండా ఇలాంటి కుటిల ఎత్తుగడలకు
పూనుకుంటున్నాయి. కోవర్టు అనే ఎత్తుగడలో నాయకత్వ నిర్మూలన లక్ష్యంతోపాటు పార్టీలో, విప్లవ శ్రేణులలో గందరగోళాలనూ, అవిశ్వాసాలను కలగజేయడమనే కుట్ర కూడా దాగి ఉంది. దీనిని ప్రజలు, విప్లవాభిమానులు చైతన్య పూర్వకంగా అర్థం చేసుకోవాలి.


ఈ ద్రోహుల మరణాలకు ప్రభుత్వమే ప్రధాన బాధ్యత వహించాలి. ఆ కుట్రలో భాగం పంచుకున్న కుటుంబ సభ్యుల బాధ్యతను కూడా గుర్తించాలి. నిరుదోగ్య యువతకు ఉద్యోగం, డబ్బుల ఆశలు చూపి సంఘవిద్రోహ శక్తులుగా మార్చి, చివరకు వారి ప్రాణాలతో ఆడుకుంటున్న పోలీసుల కుట్రలను అర్థం చేసుకొని అందులో నుండి బయటకు రావాలనీ, దానిని అర్థం చేసుకొని యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, పేదరికం తదితర సమస్యలకు ప్రభుత్వ విధానాలే కారణం కనుక వాటికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నాం. శతృవు అనుసరిస్తున్న కోవర్టు కుట్రలను ప్రజలు పసిగట్టి ఎప్పటికప్పుడు పార్టీని అప్రమత్తం చేస్తూ తిప్పికొట్టడం ద్వారా విప్లవోద్యమాన్ని రక్షించుకోవాలని కోరుతున్నాం.
గణేష్
Ganesh
కార్యదర్శి.
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)
ఆంధ్ర-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ’.

Advertisement

తాజా వార్తలు

Advertisement