Friday, September 20, 2024

NLG: వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం… కలెక్టర్

రెండవ విడత రుణమాఫీ నిధులు విడుదల
సమస్యల పరిష్కారానికి 08685- 293312 టోల్ ఫ్రీ నెంబర్
బ్యాంకర్లు సహకరించాలని ఆదేశం
కలెక్టర్ హనుమంతు కె జెండగే
ప్రభన్యూస్, ప్రతినిధి / యాదాద్రి : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి రైతుల మేలు కోసం ప్రత్యేకంగా రుణమాఫీ పథకం తీసుకొచ్చిందని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండగే అన్నారు. మంగళవారం రైతు రుణమాఫీ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ, కోఆపరేటివ్, బ్యాంకర్ల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభా ప్రాంగణం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రెండవ విడుత రుణ మాఫీ నిధుల విడుదల ప్రకటన ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.

అనంతరం జిరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ… రెండవ విడుత రైతు రుణ మాఫీ నిధుల విడుదల పట్ల రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో 17 రైతు వేదికలలో రైతు నేస్తం కార్యక్రమం క్రింద రైతులు ముఖ్యమంత్రి సందేశాన్ని వీక్షిణించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతుల మేలు కోసం రైతు రుణ మాఫీ పథకం తెచ్చిందని, 12 డిసెంబర్ 2018 నుండి 9-డిసెంబర్2023 వరకు రైతుల రుణాలకు సంబంధించి రెండు లక్షల వరకు రుణ మాఫీ చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈనెల 18న మొదటి రుణ మాఫీ క్రింద ఒక లక్ష రూపాయల వరకు జిల్లాలో 36,483 మంది రైతులకు రూ. 199 కోట్ల 87 లక్షలు రుణ మాఫీ చేశామని చెప్పారు. ప్రస్తుతం రెండవ విడుత రైతు రుణ మాఫీ క్రింద జిల్లాలో 16,143 మంది రైతు కుటుంబాలకు రూ. 165 కోట్ల, 87 లక్షల 29 వేల 511 రూపాయలు రుణ మాఫీ చేయడం జరిగిందని చెప్పారు. రైతులకు సకాలంలో రుణం అందిస్తే విత్తనాలు, పెట్టుబడికి ఉపయోగం అవుతుందని, రైతులకు రుణం భారంగా మారినందున రుణ మాఫీ చేపట్టడం జరిగిందని తెలిపారు.

జిల్లా స్థాయిలో రైతులకు రుణమాఫీపై ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించడానికి 08685- 293312 టోల్ ఫ్రీ నెంబరులో సంప్రదించాలని, ప్రతి క్లస్టర్ రైతు వేదికలలో రైతులు తమ ఆధార్ వివరాలతో వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదిస్తే వారు అన్ని విషయాలపై కావలసిన చర్యలు తీసుకుంటారని సూచించారు. బ్యాంకర్లు రుణమాఫీ ప్రక్రియలో కీలకపాత్ర పోషించాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణ మాఫీని రైతులకు చేరేలా చర్యలు తీసుకోవాలని, రెన్యువల్ చేయాలని సూచించారు.కార్యక్రమంలో రైతులు శీశైలం, మంగమ్మ, మల్లేశం, శ్రీహరి, సావిత్రి తమకు రుణమాఫీ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ తిరిగి వ్యవసాయానికి పెట్టుబడిగా వాడతామని తెలిపారు. రైతులకు రుణ మాఫీ చెక్కులను జిల్లా కలెక్టరు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ, ఏరువాక శాస్త్రవేత్త అనిల్ కుమార్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజరు శివరామకృష్ణ, జిల్లా సహకార అధికారి నాగమణి, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement