Friday, September 6, 2024

Nalgonda – ఎస్ఎల్బీసీకి ₹2200 కోట్లు – శరవేగంగా పనులు

వచ్చే మార్చి నాటికి బ్రాహ్మ‌ణ వెల్లేముల ప్రాజెక్టు పూర్తి
స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మాది రైతు సంక్షేమ ప్ర‌భుత్వం
హైదరాబాద్​, విజయవాడ ఆరులైన్ల రహదారి
గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ
₹2 కోట్ల‌తో వేణుగోపాల‌స్వామి ఆల‌యం అభివృద్ధి చేస్తా
రుద్రయాగంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, న‌ల్ల‌గొండ: బ్రాహ్మ‌ణ వెల్లేముల ప్రాజెక్టును వ‌చ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామ‌ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం నార్కెట్ పల్లి మండలం గోపాలాయపల్లి శ్రీవారిజాల వేణుగోపాలస్వామి దేవాలయంలోని జ‌రుగుతున్న‌ సుదర్శన యాగ సహిత రుద్ర యాగంలో పాల్గొన్నారు. అనంత‌రం నల్లగొండ పట్టణంలోని రామగిరి సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పూర్తికి ₹2200 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి విడుద‌ల చేశార‌న్నారు. పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు.

మాది రైతు సంక్షేమ ప్ర‌భుత్వం

రైతు సంక్షేమ‌మే త‌మ ప్ర‌భుత్వం ధ్యేయ‌మ‌ని మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా ఒక్క రోజులోనే ఆరు వేల కోట్ల రూపాయ‌ల రుణ‌మాఫీ చేశామ‌ని చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో ల‌క్ష‌న్న‌ర రూపాయ‌ల లోపు రుణాలు ఉన్న రైతు బ్యాంకు ఖాతాలో జ‌మ చేస్తామ‌ని, అలాగే ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. రైతులు సుఖ‌సంతోషాల‌తో ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ధ్యేయ‌మ‌ని, అందుకే రూ.32 వేల కోట్లు రుణ‌మాఫీ చేశార‌న్నారు.

- Advertisement -

₹2 కోట్ల‌తో వేణుగోపాల స్వామి ఆల‌య అభివృద్ధి

శ్రీ‌వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయం అభివృద్ధికి ₹రెండు కోట్లు మంజూరు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి తెలిపారు. చెరువుగట్టుల్లో వంద గ‌దుల గ‌ల కాటేజిలు నిర్మిస్తామ‌న్నారు.

హైద‌రాబాద్‌- విజ‌య‌వాడ ఆరు లైన్ల ర‌హ‌దారి

హైదరాబాద్ -విజయవాడ ఆరు లైన్ల జాతీయ రహదారికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరి అంగీక‌రించిన‌ట్లు మంత్రి కోమ‌ట‌రెడ్డి చెప్పారు. వచ్చే నెలలో ఈ రహదారి పనులకు టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి టెంపుల్ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర కుమార్, స్థానిక తహసిల్దార్ వెంకటేశ్వరరావు, డీఎస్‌పీ శివరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement