Friday, October 4, 2024

TG: మంత్రి కొండాపై కోర్టులో నాగార్జున పిటిష‌న్.. విచార‌ణ సోమ‌వారానికి వాయిదా..

త‌న కుటుంబం ప‌రువు తీశారంటూ నాగ్ పిటిష‌న్
మంత్రి కొండాపై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాలంటూ విన‌తి
హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌ విచారణను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. న్యాయమూర్తి సెలవులో ఉన్నందున పిటిషన్‌ విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. కాగా, ఇటీవల కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యల మీద హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం పిటిషన్‌ వేశారు. తమ కుటుంబ గౌరవ ప్రతిష్టలను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కొండా సురేఖపై చట్ట ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్‌లో కోరారు. 2017లో తన కుమారుడు నాగచైతన్య సమంత వివాహం చేసుకున్నారని, 2021లో కొన్ని అనివార్య కారణాల వల్ల వారు విడిపోయారని తెలిపారు. ఇప్పుడు వారిద్దరూ గౌరవప్రదంగా ఎవరి జీవితం వారు గడుపుతున్నారన్నారు.

దశాబ్దాలుగా పేరు ప్రఖ్యాతలు కాపాడుకుంటూ వస్తున్న తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ దురుద్దేశంతోనే నిరాధార ఆరోపణలు చేశారని, ఈ వ్యాఖ్యలతో తమ కుటుంబంపై తప్పుడు సంకేతాలు వెళ్లాయని పిటిషన్‌లో నాగార్జున కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement