Wednesday, October 23, 2024

TG: మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురైన‌ మంత్రి పొంగులేటి..

తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో చెరువుల నిండిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్ పరిధిలోని అన్ని చెరువులూ నిండు కుండల్లా మారిపోయాయి. పలుచోట్ల వర్ష సంబంద ఘటనల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు.

పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో యాకూబ్ అనే ఇటుకలు తయారు చేసే కూలీ కుటుంబం వరదలో కొట్టుకుపోయిందన్నారు. ఈ ఘటనను వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. రెస్క్యూ టీం ఎంతో శ్రమకోర్చి వారిని కాపాడే ప్రయత్నాలు చేసిందని వివరించారు. యాకూబ్ కొడుకును మాత్రమే టీం కాపాడగలిగిందని తెలిపారు. మిగిలిన సభ్యులు కూడా రెస్క్యూ టీంకు దొరకాలని భగవంతుడిని ప్రార్థించారు.

వారిని కాపాడటానికి తాను హెలికాప్టర్ కోసం కూడా ప్రయత్నించానని, కానీ, వాతావరణం సహకరించని కారణంగా ఆ ప్రయత్నం సఫలం కాలేదని తెలిపారు. ఈ వివరాలు చెబుతూ మంత్రి పొంగులేటి భావోద్వేగానికి గురయ్యారు. మీడియా సమావేశంలోనే కంటతడి పెట్టుకున్నారు. వారికి లైఫ్ జాకెట్స్ ఉన్నాయని, కాబట్టి, వారు దొరికే అవకాశాలు ఉన్నాయని, దొరకాలనే తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. వారితో మాట్లాడినప్పుడు ఆ తల్లి రోధించిందని చెప్పారు. తాము మరికాసేపట్లో చావబోతున్నామనే బాధ వారి గొంతులో వినిపించిందని, ఆ బాధ వర్ణనాతీతమని కంటతడి పెట్టుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement