Saturday, October 19, 2024

KTR | మూసీ పేరుతో ప్రజాధనం లూటీ… ఇదే సీఎం రేవంత్‌ రెడ్డి ప్లాన్

  • బిల్డర్లను బెదిరించి డబ్బు వసూళ్లు
  • ఢిల్లీ హైకమాండ్​కు మూటలు మోసే యత్నాలు
  • నాగోల్​లో దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రం
  • బీఆర్​ఎస్​ హయాంలోనే ప‌లు ఎస్టీపీలను నిర్మించాం
  • కేసీఆర్​ కట్టిన వాటికి రేవంత్​ ప్రారంభోత్సవాలు
  • మూసీపై అద్భుత నిర్మాణాలకు ఎస్టిమేట్లు వేశాం
  • ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పనులు చేయొచ్చు
  • డీపీఆర్​ లేకుండానే ఇండ్లు ఎందుకు కూల్చేస్తున్నారు
  • సోకుల కోసం పేదలను రోడ్డుపాలు చేయొద్దు
  • మోదీ చేపట్టిన నమామీ గంగే కంటే.. మూసీ పెద్ద ప్రాజెక్టా ?
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నాగోల్ ఎస్టీపీని సందర్శించిన కేటీఆర్​

నాగోల్ (ఆంధ్ర ప్రభ)​: మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి ప్లాన్‌ వేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ₹26 వేల కోట్లతో మొత్తం మూసీ పునరుజ్జీవం అవుతుందని, కానీ రేవంత్‌ రెడ్డి మాత్రం లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్‌కు మూటలు మోయడానికి రేవంత్‌ రెడ్డి దొరికాడని చెప్పారు. హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. మూసీ బఫర్‌ జోన్‌లో ఉన్నవాళ్లను కబ్జాదారులని రేవంత్‌ ముద్ర వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నాగోల్‌లోని ఎస్టీపీని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి శనివారం కేటీఆర్‌ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. నాగోల్‌లో దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని బీఆర్​ఎస్ ప్రభుత్వ హయాంలో​ నిర్మించామని చెప్పారు. ఇక్కడ శుద్ధి చేసిన నీళ్లు నల్లగొండ జిల్లాకు పోతాయన్నారు. రేవంత్‌ రెడ్డి కొత్తగా చేసేదేం లేదన్నారు. ఈ ఎస్టీపీలను సక్రమంగా నడుపుకుంటే చాలన్నారు.

మూసీని మురికి కూపంగా మార్చింది వారే..

మూసీ నది హైదరాబాద్‌ ఒక వరమని, దానిని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలేనని కేటీఆర్​ అన్నారు. హైదరాబాద్‌లో రోజూ 20 కోట్ల లీటర్ల మురికినీరు ఉత్పత్తి అవుతున్నదన్నారు. దక్షిణాసియాలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే నగరం లేదని వెల్లడించారు. మురుగునీటిని వంద శాతం శుద్ధి చేస్తున్నది ఒక్క హైదరాబాద్‌లోనేనని చెప్పారు. కేసీఆర్‌ హయాంలోనే ఈ ఘనతను సాధించామన్నారు. ₹3,800 కోట్ల ఖర్చుతో ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. నగరంలోని 54 నాలాల నుంచి మూసీలోకి మురికి నీరు వస్తుందని చెప్పారు.

కేసీఆర్​ నిర్మిస్తే.. రేవంత్​ ప్రారంభిస్తున్నారు

బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన ఎస్టీపీలను రేవంత్‌ రెడ్డి ప్రారంభిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో 57.7 కిలోమీటర్లు మూసీ ప్రవహిస్తుందన్నారు. మూసీపై 15 చోట్ల బ్రిడ్జిలను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు. చారిత్రక, వారసత్వ సంపదను కాపాడుతూ ఆధునికంగా నిర్మించాలని నిర్ణయించామన్నారు. బ్రిడ్జిల నిర్మాణానికి ₹545 కోట్లు మంజూరు చేశామన్నారు. రోడ్‌ కం బ్రిడ్జ్‌ కం చెక్‌ డ్యాం నిర్మించాలనుకున్నామని చెప్పారు. మూసీపై ₹10 వేల కోట్లతో భారీ స్కై ఓవర్‌ నిర్మించాలనుకున్నామని తెలిపారు.

- Advertisement -

సోకుల కోసం పేదలను రోడ్డునపడేయొద్దు..

ఎంత శుద్ధి చేసినా మూసీ నీళ్లు తాగేవి కాదని కేటీఆర్​ అన్నారు. అందువల్ల కొండపోచమ్మ సాగర్‌ నుంచి మూసీకి నీళ్తు తేవాలని నిర్ణయించామన్నారు. గోదవారి నుంచి నీళ్లు తెచ్చేందుకు ₹1100 కోట్లతో ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఆ ప్రాజెక్టుకు గతేడాది మే 18న శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రేవంత్‌ రెడ్డి ప్లాన్‌ వేశారని చెప్పారు. ₹26 వేల కోట్లతో మొత్తం మూసీ పునరుజ్జీవం అవుతుందని, కానీ రేవంత్‌ రెడ్డి మాత్రం లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌కు మూటలు మోయడానికి రేవంత్‌ రెడ్డి దొరికాడని చెప్పారు.

హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మూసీ బఫర్‌ జోన్‌లో ఉన్నవాళ్లను కబ్జాదారులని రేవంత్‌ ముద్ర వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి తనను మూసీ వద్ద 3 నెలలు ఉండాలని అంటున్నడు.. 60-70 ఏండ్ల నుంచి ప్రజలు ఇక్కడే ఉంటున్నారనే విషయం తెలుసుకోవాలన్నారు. మూసీ పక్కన తాను మూడు నెలలు కాదు మూడేండ్లు ఉంటానని స్పష్టం చేశారు. మూసీ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, కొత్తగా రేవంత్‌ చెప్పాల్సింది లేదన్నారు. సోకుల కోసం పేదలను రోడ్డున పడేయొద్దని ముఖ్యమంత్రికి సూచించారు. రేవంత్‌ తన కుర్చీ కాపాడుకోవడానికి కావాలంటే చందాలిస్తామన్నారు.

నమామి గంగే ప్రాజెక్టుకంటే గొప్పదా..

2400 కిలోమీటర్ల పొడవైన నమామి గంగే ప్రాజెక్టు కోసం ప్రధాని మోదీ ₹40 వేల కోట్లు ఖర్చు చేశారని, మూసీ కోసం రేవంత్‌ కిలోమీటర్‌కు ₹2700 కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. మూసీకి రెండువైపుల రిటెయినింగ్‌ వాల్‌ కట్టాలని సూచించారు. మూసీ మీద ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించాలని చెప్పారు. అంతకంటే కొత్తగా రేవంత్‌ రెడ్డి చేయాల్సిందేమీ లేదన్నారు. మూసీ బాధితులకు తామంతా అండగా నిలబడతామని చెప్పారు. మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్‌ లేకుండానే ఇండ్లెందుకు కూలగొడుతున్నారని ప్రశ్నించారు. ఇండ్లు ఖాళీ చేయాలని అధికారులు అడిగితే నిలదీయాలని ప్రజలకు సూచించారు. మూసీ పేరుతో జరుగుతున్న లూటీకి చరమగీతం పాడాలన్నారు. నాలా అభివృద్ధి పనుల వల్ల గతంలో మునిగిన కాలనీలు ఇప్పుడు సురక్షితంగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి గ్రాఫిక్స్‌ మాయాజాలానికి మీడిగా ఆగం కావొద్దన్నారు. మూసీలోని మురికి నీరు ఎస్టీపీలో ఎలా శుభ్రం అవుతుందో కేటీఆర్‌ చూపించారు.

ప్రజలను ఇబ్బందిపెడితే చూస్తూ ఊరుకోం..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సీవరేజ్‌ ప్లాంట్ల ఏర్పాటును కేటీఆర్‌ చేపట్టారని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి అన్నారు. ₹3800 కోట్లతో 31 ఎస్టీపీల నిర్మాణాన్ని చేపట్టామని వెల్లడించారు. స్వచ్ఛమైన నీరు మూసీలోకి వదలాలని ఈ ఎస్టీపీలను నిర్మిస్తున్నామని తెలిపారు. మూసీపై 15 బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని భావించామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మూసీ ప్రాజెక్టుపై డీపీఆర్‌ లేదని, ఎస్టిమేషన్‌ లేదని విమర్శించారు. ప్రజలకు ఇబ్బంది పెట్టే చర్యలకు పాల్పడితే బీఆర్‌ఎస్‌ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మూసీ పరివాహక ప్రజలకు బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ ఆలీ ,సబితా ఇంద్రారెడ్డి ,తలసాని శ్రీనివాస్ యాదవ్ ,ఎమ్మెల్యేలు బండారి లక్ష్మా రెడ్డి ,వివేకానంద్ గౌడ్ ,మాధవరం కృష్ణారావు ,ముఠా గోపాల్ ,కాలేరు వెంకటేష్ ,ఎమ్మెల్సీ సురభి వాణిదేవి మరియు బీఆర్ఎస్ బృందం పరిశీలించింది.ఇట్టి కార్యక్రమంలో ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని మాజీ కార్పొరేటర్లు,ఉద్యమకారులు,సీనియర్ నాయకులు,పలు డివిజన్ల తాజా మరియు మాజీ అధ్యక్షులు,అధ్యక్షరాళ్లు,పలు విభాగాల కమిటీ అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు,పలు విభాగాల మాజీ కమిటీ ధర్మకర్తలు,మహిళలు,కార్యకర్తలు,పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement