Friday, October 18, 2024

TG| అస్తిత్వ ఉద్యమాలకు ఆధ్యుడు కుమ్రం భీం… కేటీఆర్

  • ఆదివాసీ యోధుడు అర‌ణ్య సూర్యుడు
  • ఆత్మగౌరవ పోరాటాలకు నిత్య ప్రేరణ
  • ఆయ‌న స్ఫూర్తితో ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాం
  • పోడు భూముల‌పై పూర్తి హ‌క్కులు క‌ల్పించాం
  • మా తండాల్లో మా రాజ్యం క‌ల నెర‌వేర్చాం
  • స్కూళ్లు, గురుకులాల‌తో మంచి చ‌దువులు
  • విదేశీ విద్య‌కోసం స్కాల‌ర్‌షిప్ అందించాం
  • కుమ్రంభీం వ‌ర్థంతి సంద‌ర్భంగా కేటీఆర్ నివాళి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌: దేశం గర్వించదగ్గ గిరిజన తిరుగుబాటు వీరుడు, గోండు బెబ్బులి కుమ్రం భీం 84వ వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నివాళులర్పించారు. ఆయన ఆదివాసీ యోధుడు, అరణ్య సూర్యుడు, పోరాటాల పోతుగడ్డ మీద పుట్టిన అడవి తల్లి ముద్దుబిడ్డ అని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ఉద్యమ బాటలో, ఉజ్వల ప్రగతి దారిలో జల్.. జంగల్.. జమీన్ నినాదమే స్ఫూర్తిగా తామంతా కొమురం భీం ఆశయాల అడుగు జాడల్లో పయనించామని తెలిపారు. కొండల్లో కోనల్లో ఉన్న ప్రతి గూడేనికి, తండాకు స్వచ్ఛమైన మంచినీళ్ల సరఫరాతో విష జ్వరాల చావుల నుంచి విముక్తి కల్పించామని వెల్లడించారు.

పోడు భూముల‌కు పూర్తి హ‌క్కులు…
తెలంగాణ‌లో నాలుగు లక్షల ఎకరాలకు పైగా పోడు భూములపై హక్కులు కల్పిస్తూ.. అడవి బిడ్డలకు పట్టాభిషేకం చేశామని కేటీఆర్ గుర్తుచేశారు. మావనాటే మావరాజ్.. ‘మా గూడెంలో మా తండాలో మా రాజ్యం’ ఆకాంక్ష స్వరాష్ట్రంలో నెరవేరిందని చెప్పారు. 2,471 గిరిజన పంచాయతీల్లో స్వయం పాలనా జెండా ఎగిరిందన్నారు. అవకాశాల్లో జనాభా దామాషా ప్రకారం సముచిత వాటా దక్కేలా గిరిజన రిజర్వేషన్లను 10శాతానికి పెంచుతూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 188 గురుకుల పాఠశాలలు, 125 గురుకుల ఇంటర్ కాలేజీలు, 22 గురుకుల డిగ్రీ కళాశాలలతో అడవి బిడ్డల విద్యా వికాసానికి నిబద్ధతతో కృషి చేశామని పేర్కొన్నారు.

విదేశీ చ‌దువుల క‌ల సాకారం చేశాం..
అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ తో విదేశీ చదువుల కలలు సాకారం, గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దిన సీఎంఎస్టీఈఐ స్కీం, ఆ మహనీయుని పేరుతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన కుమరం భీం ఆదివాసీ భవన్, సేవాలాల్ బంజారా భవన్లు గిరిజన అస్తిత్వానికి ప్రతీకలుగా నిలిచాయని తెలిపారు. గిరిజన సంస్కృతికి గొప్ప గౌరమైన సమ్మక్క సారక్క జాతర, నాగోబా, జంగుబాయి, చెంచుల బౌలాపూర్, ఎరుకల నాంచారమ్మ, గాంధారి మైసమ్మ, కొలాం పండుగలకు భారీగా నిధులు విడుదల చేశామని, అధికారికంగా నిర్వహించామని వెల్లడించారు. అస్తిత్వ ఉద్యమాలకు, ఆత్మగౌరవ పోరాటాలకు నిత్య ప్రేరణ అందించే రణధీరుడు కుమ్రం భీంకు ఎక్స్‌ వేదికగా జోహార్లు అర్పించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement