Sunday, October 6, 2024

KTR vs Revanth – చలో ఢిల్లీ కాదు .. చలో పల్లె చేప‌ట్టండి

రైతులు ఆగం అవుతుంటే హ‌స్తిన‌లో ప‌ర్య‌ట‌న‌లా
20 సార్లు ఢిల్లీ వెళ్లి తెలంగాణ‌కు తెచ్చింది గుండుసున్నా
రైతుల‌కేమో మాయ‌మాట‌లు..
ఢిల్లీ పెద్ద‌ల‌కేమో నోట్ల మూట‌లా
ఎన్నిక‌ల స‌మ‌యంలో గాలి మాట‌లు..
ఇప్పుడేమో గాలి మోట‌ర్ల‌లో షికార్లా
రేవంత్ రెడ్డిపై ట్విట్ట‌ర్‌లో కేటీఆర్ ఫైర్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ :
రుణమాఫీ పూర్తి కాక‌.. లక్షలాది రైతులు రగిలిపోతుంటే.. వారివైపు కన్నెత్తి చూడకుండా హస్తిన యాత్రలా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ప్ర‌శ్న‌ల వ‌ర్సం కురిపించారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకటి కాదు.. రెండు కాదు ఎనిమిది నెలల్లో ఏకంగా 20 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారా? రిమోట్ కంట్రోల్ పాలనతో రైతులను బలి చేస్తారా? అని ఎక్స్ వేదిక‌గా శుక్ర‌వారం ట్వీట్‌ చేశారు. సీఎం రేవంత్‌కు దమ్ముంటే “చలో ఢిల్లీ” కాదు.. “చలో పల్లె” చేపట్టాల‌ని కేటీఆర్ స‌వాల్ చేశారు. ఎన్నికల్లో అన్నీ గాలిమాటలు చెప్పార‌ని, గద్దెనెక్కగానే గాలిమోటర్లలో ఊరేగుతున్నార‌ని విమ‌ర్శించారు.. మీ యాత్రలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిన ప్రయోజనమేంటి రేవంత్ జీ అంటూ నిల‌దీశారు.

- Advertisement -

అన్నదాతలను ఆగంచేసి.. దేశ రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే.. రైతుల తండ్లాట తీర్చేదెవరు.. రుణమాఫీ పూర్తిచేసెదెవరు? అంటూ సీఎం రేవంత్‌పై కేటీఆర్ ప్ర‌శ్న‌లు కురిపించారు. అధిష్టానం మెప్పు కోసం పగలూ రాత్రి తపన తప్ప అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా? అంటూ పైర్ అయ్యారు. రైతులకేమో మాయమాటలు.. ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా? అని ప్ర‌శ్నించారు. 20 సార్లు చేపట్టిన ఢిల్లీ యాత్రలతో తెలంగాణకు దక్కింది.. “గుండుసున్నా” అన్నారు. ఓవైపు డెంగీ మరణాలు.. మరోవైపు పెరుగుతున్న నేరాలు.. ఇంకోవైపు అన్నదాతల ఆందోళనలు.. గాడితప్పిన పాలనతో.. రాష్ట్రమంతా అట్టుడుకుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో.. ముఖ్యమంత్రి, మంత్రులు ఉండాల్సింది.. ఢిల్లీలో కాదు.. తెలంగాణ గల్లీల్లో.. అంటూ చుర‌క‌లంటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement