Thursday, October 17, 2024

TG: నిరుద్యోగుల ఆరెస్ట్ ల‌ను ఖండించిన కేటీఆర్..

స‌చివాల‌యం ముట్ట‌డికి నిరుద్యోగుల పిలుపు
ముందుగానే ప‌లు విద్యార్ధి సంఘాల నేత‌ల అరెస్ట్
ఘాటుగా స్పందించిన కేటీఆర్
స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పోరాడుతుంటే అరెస్ట్ లా
అంద‌రినీ వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్
ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ : నిరుద్యోగ యువకులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గ పూరితంగా వ్యవహరిస్తోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వారి సమస్యలను సానుకూల థృక్పథంతో నెరవేర్చాల్సింది పోయి నిర్భంధం పెడతూ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. విద్యార్థుల డిమాండ్ల కోసం సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించిన రాజారాం యాదవ్ సహా ఇతర విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయటాన్ని కేటీఆర్ ఖండించారు. రాజారాం యాదవ్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని నమ్మబలికిన సర్కార్ ఇప్పుడు వారిని గాలికి వదిలేసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకురావడం, శాంతియుతంగా ఆందోళన చేయడం కూడా ఈ ప్రజాపాలన నిషేధమా అని కేటీఆర్ ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం అణిచివేత ధోరణిని సాగిస్తుందని ఇది ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరించారు. పోలీసులు అరెస్ట్ చేసిన రాజారాం యాదవ్ సహా మిగతా విద్యార్థి నాయకులందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ వారిని ఇప్పుడు పట్టించుకోవడం మానేసిందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు విద్యార్థులు, నిరుద్యోగులు చేస్తున్న డిమాండ్లను పరిష్కరించకుంటే ఏ నిరుద్యోగులను రెచ్చగొట్టి గద్దెనెక్కారో ఇప్పుడు వాళ్లే ఈ ప్రభుత్వం పతనానికి కారణమవుతారన్నారు. నిరుద్యోగ డిమాండ్లను పరిశీలించకుండా ప్రభుత్వం ఇలాగే మొండి వైఖరి అవలంభిస్తే తప్పకుండా బీఆర్ఎస్ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement