Tuesday, September 24, 2024

TG | ప్రభుత్వానికి – పట్టభద్రులకు వారధిగా పని చేస్తా : నరేందర్‌రెడ్డి

ఆదిలాబాద్, కరీంనగర్, నిజామా బాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట‌ర్లు తనను ఆదరించాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి కోరారు. మంగళవారం మెదక్ లోని, తెలంగాణ గురుకుల పాఠశాల, ప్రభుత్వ హై స్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాల అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు… అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.

34 సంవత్సరాలుగా విద్యారంగంలో ఉన్న తాను వేలాది మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ల స్కూళ్లు, కళాశాలలకు దీటుగా తెలంగాణ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించినట్లు వివరించారు. విద్యా ర్థులు, నిరుద్యోగులు, యువత సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు.

పట్టభద్రులు తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు… తాను ఎమ్మెల్సీగా గెలిస్తే వచ్చే వేతనాన్ని నిరుపేద విద్యార్థులకు బడుగు బలహీన వర్గాల ఉద్యోగాల సంక్షేమానికి వెచ్చిస్తానని వెల్లడించారు. తమ విద్యాసంస్థల ద్వారా ఏటా 40 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందిస్తున్నామని తెలిపారు. తమ కళాశాలల్లో చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. మేధావి వర్గం నుంచి వచ్చిన తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు.

ఓటరు నమోదు పై ప్రత్యేక దృష్టి

అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో అదిలాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు నరేందర్రెడ్డి తెలిపారు. ఈ నెల 30 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఓటరు నమోదు కార్యక్రమం ఉన్నందున ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి, ఎన్నికల సంఘం ఆన్‌లైన్‌లో ఓటు నమోదు చేస్తామన్నారు.

గ్యాడ్యుయేట్లు తమ ఓటరు, ఆధార్ కార్డులు, ఆధార్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఈ అవకాశాన్నివినియోగించుకోవాలని సూచించారు. ఈ ఎన్నికల్‌లో నాలుగు జిల్లాల్లో 5 నుంచి 6 లక్షల మంది పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ లు, ఉపాధ్యాయులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement