Friday, October 18, 2024

KNR | పండుగ పూట విషాదం… పెళ్లయి, ఇద్దరు పిల్లలున్నా !

యైటింక్లయిన్‌కాలనీ, (ప్రభన్యూస్‌): పెళ్లయ్యి ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన ఓ యువ‌తి… ప్రేమ మోజులో పడి చివరికి ప్రియుడి ప్రాణాలు గాలిలో కలిసేందుకు కారణమైంది. బతుకమ్మ పండుగ వేళ తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యైటింక్లయిన్‌ కాలనీ హనుమాన్‌ నగర్‌లో చోటు చేసుకుంది.

టూటౌన్‌ సీఐ ప్రసాద్‌రావు, యువకుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… సెక్టార్‌- 3 డిస్పెన్సరీలో స్కావెంజర్‌గా పనిచేస్తున్న వడ్డాది కుమార్‌ టీ2 క్వార్టర్‌లో నివాసముంటున్నాడు. అతని కుమారుడు గోదావరిఖని సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో స్కావెంజర్‌గా పనిచేస్తున్న‌ వినయ్‌ (27)…. బాపూజీనగర్‌కు చెందిన పెళ్లయిన యువతి అంజలీతో ప్రేమలో పడ్డాడు.

ఈ విషయంలో అంజలీ భర్త కుటుంబ సభ్యులు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసుల సమక్షంలోనే ప్రేమించిన యువకుడితో ఉంటానని చెప్పింది. ఆపై ప్రియుడిని పెళ్లి చేసుకుని మూడు నెలలుగా ఇరువురు యైటింక్లయిన్‌ కాలనీలోని హనుమాన్‌ నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు.

ఈ క్రమంలో ఈరోజు అంజలీకి తన అన్న ఫోన్‌ చేసి కాలనీకి వచ్చానని, ఒకసారి చూసి వెళ్తానని చెప్పడంతో ఇంటి అడ్రస్‌ను తెలియజెసింది. పథకం ప్రకారం.. అంజలీ మాజీ భర్తతో కలిసి వచ్చిన అన్న ఇంట్లో మాట్లాడుకుంటూనే వినయ్‌ కుమార్‌పై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement