Saturday, September 21, 2024

KNR: గర్భిణీ స్త్రీలకు సంపూర్ణ వైద్య సేవలను అందించాలి… కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లిరూరల్, సెప్టెంబర్ 21(ప్రభ న్యూస్): గర్భిణీ స్త్రీలకు సంపూర్ణమైన వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమర్థవంతంగా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కలెక్టరేట్ లో గర్భిణీ మహిళలకు అందే వైద్య సేవలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భిణీల నమోదు తక్కువగా ఉందని, ప్రతి గర్భిణీ స్త్రీ 100శాతం రిజిస్టర్ అయ్యేలా చూడాలని, గర్భిణీ స్త్రీలు నమోదు కోసం ఎల్ఎంపి, నవ దంపతుల లిస్ట్ ప్రిపేర్ చేసి వారిని ట్రాక్ చేయాలని కలెక్టర్ సూచించారు.

గర్భిణీ మహిళల జాబితా ప్రతి హెల్త్ సూపర్వైజర్ వద్ద ఉండాలని, బర్త్ ప్లాన్ రూపొందించుకొని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ జరిగేలా చర్యలు తీసుకోవాలని, కనీసం 80శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న 102 వాహనాలను ఉపయోగించుకొని గర్భిణీ స్త్రీలను పరీక్షలకు తరలించాలని, ఏ రోజు ఏ గర్భిణి మహిళలను పరీక్షలకు తీసుకురావాలో జాబితా తయారు చేసుకోవాలన్నారు.

ఎం.ఎల్.హెచ్.పి, హై రిస్క్ గర్భిణి కేసులను నెల ముందుగానే ఫాలో అప్ చేస్తూ అవసరమైన సమయంలో వెంటనే 108 వాహనంలో  మాత శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి తరలించేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. పెద్దపల్లిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో డెలివరీ అయిన వారికి ప్రత్యేక ఏసీ రూములు (రుసుం చెల్లించే) ఉన్నాయని, అవసరమైన వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. విధి నిర్వహణలో సూపర్వైజర్లు సమయపాలన పాటించాలని, డ్యూటీ సమయం ముగిసే వరకు ఉండాలని, సీనియర్ సూపర్వైజర్లు మెడికల్ అధికారి సూచనలు పాటించాలని కలెక్టర్ తెలిపారు.

- Advertisement -

ప్రతి ఆరోగ్య కేంద్రంలో అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రణాళిక రూపొందించి అవసరమైన పరీక్షలు నిర్వహించాలన్నారు. ఫీవర్ సర్వేలో ఎక్కువ జ్వరాలు నమోదైన గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి సహకారంతో ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, వైరల్ జ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. ప్రమోద్ కుమార్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఎడిపిహెచ్ఓ డాక్టర్ అన్న ప్రసన్న, ప్రోగ్రాం అధికారి డాక్టర్ వాణిశ్రీ, సూపర్వైజర్ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement