Sunday, September 8, 2024

Karimnagar – రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ రావాలి – రేవంత్

ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ – రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ రావాలి, దేశంలో రాహుల్ ప్రధాని కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రిజర్వేషన్లపై సర్జికల్ స్ట్రైక్ కు సిద్ధమవుతున్న మోడీ ని చిత్తుగా ఓడించాలని అన్నారు.బిజెపికి 2/3 మెజారిటీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని హిందుత్వాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్న బిజెపితరిమి కొట్టాలని పిలుపునిచ్చారు కెసిఆర్ కుట్రలు గమనించే కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు మద్దతును ఇస్తున్నారని పదేళ్ల పాటు కాంగ్రెసుదే అధికారంఉంటుందన్నారు. నేతకానీ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాట్లు కు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మోడీ తెలంగాణకు ఇచ్చిందేం లేదు బండి కరీంనగర్ కు తెచ్చింది ఏం లేదు అన్నారు. గడిచిన 10 ఏళ్లలో నరేంద్ర మోడీ తెలంగాణకు గాడిది గుడ్డు కూడా ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లా రాజారాంపల్లి, సిరిసిల్ల లో కాంగ్రెస్ జన జాతర సభ నిర్వహించారు. ఆశేష జనవాహినిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సహా ఏ విభజన హామీ కూడా నెరవేర్చని అసమర్ధ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటును అవమానించేల మోడీ మాట్లాడారని, తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, తల్లిని చంపి బిడ్డను బతికించారని అవహేళన చేసిన ఘనుడు మోడీ అంటూ విమర్శలు గుప్పించారు.

ఓట్ల కోసం హిందుత్వాన్ని వ్యాపారం చేసుకుంటున్న నీచమైన పార్టీ బిజెపి అంటూ ధ్వజమెత్తారు. దేవుని బొమ్మ చూపించి ఓట్లు అడుక్కునే నీచ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అయోధ్యలో రాముని కళ్యాణం పూర్తి కాకముందే అక్షింతలు ఇంటి ఇంటికి పంపించి సంప్రదాయాలు మంటగలిపారని వ్యాఖ్యానించారు.

- Advertisement -

మనమందరం రాముని భక్తులం కాదా? మనం పండగలు చేసుకోవడం లేదా? గ్రామ దేవతలకు కళ్ళు కోడి కోయలేదా మనకా హిందుత్వం గురించి రాముని గురించి బిజెపి వాళ్ళు చెప్పేది అంటూ విమర్శించారు. రిజర్వేషన్లపై సర్జికల్ స్ట్రైక్ చేసి రద్దు చేసేందుకు మోడీ సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపికి 2/3 మెజారిటీ ఇస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు. అందులో భాగంగానే 400 సీట్లు సాధించాలని మోడీ పదే పదే ప్రచారం చేస్తున్నాడని పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని నేను ఆరోపిస్తే నాపై కేసులు పెట్టి నోటీసులు పంపారు.

కేసులకు భయపడే వ్యక్తిని కాదు. ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం కోసం ఎన్ని కేసులు పెట్టినా భరిస్తానని పునరుద్ఘాటించారు. బిజెపి బిజెపి జనగణను వద్దంటుంది. బీసీల రిజర్వేషన్ పెంచాలని బిసి జన గణన చేపట్టి బహుజనులకు న్యాయం చేయాలని రాహుల్ కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్రంలో బీసీ జన గణనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని అవమానించిన మోడీని స్థానిక ఎంపీ బండి సంజయ్ ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. మోడీ తెలంగాణకు గాడిద గుడ్డు కూడా ఇవ్వలేదు అందుకే బండికి ఓటేయాలా అంటూ ప్రశ్నించారు. ఆనాడు అర గుండు బండిని పూర్తిగా గుండు అరవింద్ ను ఓడించారు. తెలంగాణ ప్రజలు వివేకవంతంతో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. బిజెపిని ఓడిస్తేనే రిజర్వేషన్లు కొనసాగుతాయని అందుకోసం మీరందరూ కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించాల్సిన సమయం ఆసన్నమైందనిఅన్నారు. మనం గెలవాలంటే బిజెపి ఓడాలి అందుకోసం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులంతా సైనికుల్లా వీరోచితంగా పోరాడాలని సూచించారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ లాంటి మహనీయుల ఆశయాలను పునికి పుచ్చుకున్న వాళ్ళం అన్నారు. అందుకే ప్రజాస్వామ్యం ఫరుడవిల్లెల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

. కెసిఆర్ బస్సు యాత్ర తిక్కలోడు తిరునాళ్లకు పోయినట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో పలు పార్లమెంట్ స్థానాల్లో బిజెపి బిఆర్ఎస్ మ్యాచ్ ఫిక్స్ అయ్యాయి అంటూ ఆరోపించారు. వాళ్ల గోడ మీద కాకి మా గోడ మీద వాలిన కాల్చిపడేస్తాం అన్నారు. రాబోయే ఎన్నికల్లో హంగు వస్తే తాము ప్రభుత్వంలో చేరుతామని చెప్తున్నారు అంటే వారి కుమ్మక్కు రాజకీయాలు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఇండియా కూటమిలోకి బిఆర్ఎస్ ను రానీయమంటూ కుండబద్దలు కొట్టారు.

కెసిఆర్ కుట్రలు గమనించే కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి నెల రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చి యువతకు బాసటగా నిలిచామని పేర్కొన్నారు. రామప్ప శివుని సాక్షిగా ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ రైతన్నల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకున్నానని వివరించారు.

కరీంనగర్ చైతన్యవంతమైన జిల్లా చొక్కా రావు ఎమ్మెస్సార్ లాంటి ఉద్దండులైన వారిని గెలిపించారు. తెలంగాణ ఆకాంక్ష కోసం కేసీఆర్ ను సైతం గెలిపించారు. అదే కేసీఆర్ ను మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పారు. సెమీ ఫైనల్లో కేసీఆర్ ను ఓడించిన మీరు ఫైనల్ లో మోడీని ఓడించి దేశాన్ని సురక్షితంగా ఉంచాలని కోరారు. కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ లను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని సీఎం కోరారు.

రాజారాంపల్లి, సిరిసిల్ల జనజాతర వేర్వేరు సభలలో మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ అది శ్రీనివాస్,ఎమ్మెల్యేలు విజయరామణారావ్, రాజ్ టాకూర్, వివేక్, వినోద్, ప్రేమ్ సాగర్ రావు, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ,పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీ, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు లతో పాటు కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement