Tuesday, September 17, 2024

Judgement – అన‌ర్హ‌త ఎమ్మెల్యే సంగ‌తి నాలుగు వారాల‌లో తేల్చండి… హైకోర్టు

నాలుగు వారాలే గ‌డువు

ఈ లోగా అన‌ర్హ‌త‌పై నిర్ణ‌యం తీసుకోండి
అనర్హ‌త ఎమ్మెల్యేల పిటిష‌న్ పై హైకోర్టు తీర్పు
విచార‌ణ షెడ్యూల్ ను స‌మ‌ర్పించాల‌ని ఆదేశం
ఆదేశాలు ధిక్క‌రిస్తే సుమోటాగా కేసు విచారిస్తాం

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రెటరీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అనర్హత పిటిషన్లను స్పీకర్‌ ముందుంచాలని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లోగా స్టేటస్‌ రిపోర్ట్‌ సమర్పించాలని ఆదేశించింది. గడువులోపు ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లయితే సుమోటోగా మరోసారి విచారణ చేస్తామని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ, ఇతరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇరుపక్షాల వాదనలు గత నెల 7న పూర్తయ్యాయి. నేడు తీర్పును వెలువరిస్తూ పిటిషన్ల విచారణపై షెడ్యూల్‌ రిలీజ్‌ చేయాలని స్పీకర్‌ను ఆదేశించింది. నోటీసులు ఎప్పుడు ఇస్తారు, విచారణ ఎప్పుడు జరుపుతారు, ఎప్పటివరకు వాదనలు వినాలి, ఎప్పటిలోగా ప్రొసీడింగ్స్‌ పూర్తి చేయాలనే విషయాలను ప్రకటించాలని తెలిపింది. నాలుగు వారాల్లోగా షెడ్యూల్‌ విడుదల చేయకపోతే సుమోటోగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.

- Advertisement -

ఇది ఇలా ఉంటే గత ఏప్రిల్‌ 24న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు లోతుగా విచారించింది. బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచి, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్‌), దానం నాగేందర్‌ (ఖైరతాబాద్‌), తెల్లం వెంకట్రావు (భద్రాచలం)పై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన దాఖలు చేయగా, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి మరొకరు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు నేడు తీర్పువెలువ‌రించింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement