Friday, September 27, 2024

HYDRAA – అమీన్‌ పూర్‌పై హైడ్రా ఫోక‌స్‌ – పార్కుల క‌బ్జాల‌పై రంగ‌నాథ్‌ సీరియ‌స్‌

చెరువుల స్థ‌లాల ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఆగ్ర‌హం
లే ఔట్ల‌లో సామాజిక అవ‌సరాల‌కు వ‌దిలిన స్థలాల‌ క‌బ్జా
ఆ స్థ‌లాల్లోనే విల్లాలు, అపార్ట్‌మెంట్ల‌ నిర్మాణం
స్థానికుల ఫిర్యాదు.. రంగంలోకి దిగిన హైడ్రా చీఫ్‌
బాధితులు, ఆక్ర‌మ‌ణ‌దారుల‌తో వేర్వేరుగా భేటీ
అమీన్‌పూర్‌లోని అన్ని లేఔట్లు స్వ‌యంగా ప‌రిశీల‌న
పేద‌ల‌ను ఇబ్బందిపెట్ట‌బోమ‌ని స్ప‌ష్ట‌త‌
బుల్డోజ‌ర్ల‌తో యాక్ష‌న్‌లోకి దిగేందుకు స‌న్నాహాలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్‌: ప్రభుత్వ భూములే కాదు.. పార్కు స్థలాలను కాపాడే పనిలో హైడ్రా నిమగ్నమైంది. అమీన్‌పుర్‌ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ అనుమతులిచ్చిన లేఔట్లలో పార్కుల కబ్జాపై పలు ఫిర్యాదులందడంతో సమగ్ర సర్వేకు హైడ్రా కమిషనర్ రంగ‌నాథ్ ఆదేశించారు. ఈ క్రమంలోనే అమీన్‌పుర్‌ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబరు 152, 153లో హుడా అనుమతి పొందిన వెంకటరమణ కాలనీలో పార్కుల స్థలాల కబ్జాపై వచ్చిన ఫిర్యాదులను హైడ్రా పరిశీలించి సర్వే నిర్వహించింది .హైడ్రా అధికారులతో పాటు ఈ సర్వేలో రెవెన్యూ, హెచ్ ఎండీఏ, మున్సిపల్ అధికారులు కూడా పాల్గొన్నారు. కబ్జా చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్య‌క్తులు.. ఫిర్యాదు చేసిన కాలనీవాసులతో హైడ్రా చీఫ్ రంగ‌నాథ్‌ సమాలోచ‌న‌లు చేశారు.

- Advertisement -

ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందించ‌లేదు..

హెచ్ఎండీఏ అనుమతి పొందిన లే అవుట్‌లో పార్కు స్థలాలతో పాటు తమ ఇంటి స్థలాలు కబ్జాకు గురయ్యాయని సంబంధిత శాఖల అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా కనీసం వారిలో స్పందన‌లేద‌ని.. ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగి సర్వే చేయడాన్ని ఆయా లేఔట్లలోని ప్లాట్ ఓనర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బాధితులతో హైడ్రా కమిషనర్ సమావేశం అయ్యారు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను తొలగించే క్రమంలో అమీన్‌పుర్‌ ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బాధితులతో పాటు ప్లాట్లు చేసి అమ్మేసిన రియల్ ఎస్టేట్‌వ్యాపారులను కూడా హైడ్రా కార్యాలయానికి పిలిపించి ఏవీ రంగనాథ్ మాట్లాడారు.

పార్క్ స్థ‌లాలన్నీ స్వాహా..

వెంకటరమణ కాలనీ, చక్రపురి కాలనీ, ఆర్టీసీ కాలనీ, గోల్డెన్ కేవ్ కాలనీవాసులు ఒకరి లే ఔట్‌లోకి మరొకరు వచ్చేసినట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆయా కాలనీల‌ వాసులతో పాటు లేఔట్లు వేసిన వారిని కూడా హైడ్రా చీఫ్ రంగ‌నాథ్ స‌మావేశం అయ్యి విచార‌ణ చేప‌ట్టారు. ఒకదానితో ఒకటి లింకుగా ఫిర్యాదులందడంతో సమగ్రసర్వే ద్వారా అసలు విషయం తేల్చుతామని రంగనాథ్ చెప్పడంతో ఫిర్యాదుదారులు సంతృప్తి చెందారు. అమీన్ పూర్ మొత్తం 30కి పైగా లే ఔట్ల‌లో సామాజిక అవ‌స‌రాల కోసం కేటాయించిన భూములు స్వాహా అయిన‌ట్లు గుర్తించిన‌ట్లు అధికారులు తెలిపారు.

ఆక్ర‌మ‌ణ‌ల‌ను నిర్ధారించిన హైడ్రా..

లే ఔట్లు డిజైన్‌ల‌ను సంబంధిత కార్యాల‌యాల నుంచి తెప్పించిన హైడ్రా చీఫ్ రంగ‌నాథ్‌ ఆక్ర‌మ‌ణ‌ల‌ను నిర్ధారించారు.. ఆయా స్థలాలో ఉన్న క‌ట్ట‌డాల‌ని మార్కింగ్ చేయాల‌ని ఆదేశించారు. దీంతో అమీన్ పూర్‌లోని ఆక్ర‌మ‌ణ దారుల్లో అల‌జ‌డి మొద‌లైంది.. వ‌చ్చే అదివారం హైడ్రా జేసీబీలు దూసుకురావ‌డం ఖాయ‌మ‌ని వారంతా భ‌య‌ప‌డుతున్నారు.

పేద‌ల‌ను ఇబ్బంది పెట్టం.. ఆక్ర‌మణదారుల‌ను వ‌దిలేయం

తాము నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ముందుకు వెళుతున్నామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ అమీన్ పూర్ వాసుల స‌మావేశంలో చెప్పారు..పేదలను ఇబ్బంది పెట్టడం తమ విధానం కాదని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూములను కాపాడడం, కాలనీల్లోని సామాజిక అవసరాలకు కేటాయించిన స్థలాలు కబ్జా కాకుండా చూస్తామ‌ని స్ప‌ష్ట‌త నిచ్చారు. దీంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. అమీన్ పూర్‌లో 15 రోజుల్లో సర్వే పూర్తి చేసి ఇందులో ప్రభుత్వ భూమి ఎంత, పార్కుల స్థలాలు ఎక్కడున్నాయి, ఎవరి కాలనీల్లోకి ఎవరు జొరబడి ప్లాట్‌లు మాయం జేశారనేది తేల్చుతామని చెప్పారు.

త్వ‌ర‌లో బ్యాంక‌ర్ల‌తో స‌మావేశం ..

త్వరలోనే రుణ సంస్థలతో కూడా సమావేశం పెట్టి వారి పాత్రను రుణాలు మంజూరు చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తామన్నారు రంగ‌నాథ్‌. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించడానికి రుణాలు ఇస్తే పేదవారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. రుణం తీసుకుని ఇళ్లు నిర్మించుకున్న వారిప‌ట్ల‌ మాన‌వ‌తా దృక్ఫ‌థంతోనే ఉన్నామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement