Friday, September 27, 2024

TG | సీఎం రేవంత్ రెడ్డీతో లాక్‌హీడ్ మార్టిన్ డైరెక్టర్ భేటీ..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీతో లాక్‌హీడ్ మార్టిన్ ఇండియా డైరెక్టర్ మైఖేల్ ఫెర్నాండెజ్, కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ ఆసియా పసిఫిక్ సీఈవో మ్యాథ్యూ భౌ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబుతో పాటు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ వృద్ధి చెందుతున్న తీరు, వివిధ రంగాలు విస్తరిస్తున్నతీరుపై ఈ భేటీలో చర్చించారు.

గ్రేటర్ హైదరాబాద్ సిటీ దేశంలోనే శరవేగంగా వృద్ధి చెందుతోందని కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ కంపెనీ ప్రతినిధి బృందం ఈ సందర్భంగా తమ అధ్యయన వివరాలను పంచుకుంది. గడిచిన ఆరు నెలల్లో రియల్టీతో పాటు లీజింగ్, ఆఫీస్ స్పేస్, నిర్మాణ రంగం, రెసిడెన్షియల్ స్పేస్ లోనూ హైదరాబాద్ సిటీ గణనీయమైన వృద్ధి నమోదు చేసిందని అభిప్రాయపడింది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు సంబంధించి ప్రతి ఆరు నెలలకోసారి వెల్లడించే తమ నివేదిక జులై నెలాఖరులో వెలువడుతుందని తెలిపింది. తమ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు రూట్ విస్తరణతో హైదరాబాద్ మరింత అద్భుతంగా తయారవుతుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

తాము దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడటం లేదని, హైదరాబాద్​ను ప్రపంచంలో పేరొందిన నగరాల సరసన నిలబెట్టాలనేది తమ సంకల్పమని అన్నారు. తెలంగాణ నుంచి అమెరికాలో ఉంటున్న వారి సంఖ్య, అక్కడి వెళ్లి వచ్చే వారి సంఖ్య పెరిగిపోయిందని, అందుకే న్యూయార్క్​తో పోల్చుకునేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement