Monday, October 7, 2024

HYD | దంచికొట్టిన వాన‌… రోడ్లన్నీ జ‌ల‌మ‌యం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. భారీ వర్షానికి రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి…. మెట్రో స్టేషన్ల కిందకు మోకాళ్లలోతు వరద నీరు వచ్చి చేరింది. యూసుఫ్‌గూడ, శ్రీకృష్ణనగర్‌లో కురిసిన వర్షానికి రహదారులు చెరువులను తలపించాయి. ఈ వరద ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది. శేరిలింగంపల్లిలో 58 మిల్లీమీటర్లు, షేక్‌పేట-54, మాదాపూర్-53, ఖైరతాబాద్ -51 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మరో గంటసేపు కుండపోత వర్షం కురిసే అవకాశముందని జీహెచ్ఎంసీ పేర్కొంది. వర్షానికి సంబంధించి అత్యవసర సహాయం కోసం జీహెచ్ఎంసీకి సంబంధించిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

నగరంలోని చందానగర్, మియాపూర్, కేపీహెచ్ బీ కాలనీ, ప్రగతినగర్, బాచుపల్లి, కూకట్ పల్లి, మూసాపేట, హైదర్ నగర్, మల్కాజిగిరి, కుషాయిగూడ, దమ్మాయిపేట, చర్లపల్లి, కీసర, నిజాంపేట, అమీర్ పేట్, నేరేడ్ మెట్, ఎర్రగడ్డ, సనత్ నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లి, పీర్జాదిగూడ, నాంపల్లి, మేడ్చల్, మల్లంపేట్, గండిమైసమ్మ, దుండిగల్, అంబర్ పేట, కాచిగూడ, నల్లకుండ, గోల్నాకతోపాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కుర‌వ‌డంతో వరద నీరు రోడ్లపైకి చేరుతొంది. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement