హైదరాబాద్,ఆంధ్రప్రభ : మేడ్చల్ జిల్లా శామీర్ పేటలో ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సిధ్దిపేట జిల్లా ములుగుకు చెందిన మర్కంటి భానుప్రియ (28) కుటుంబ కలహాల నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఈ మేరకు భర్త స్వామి ములుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.
ఈక్రమంలో శనివారం రాత్రి శామీర్ పేట చెరువు నీటిలో భానుఫ్రియ కూతురు దీక్ష(4) మృతదేహాలు లభ్యం అయ్యాయి. వీళ్లను ములుగుకు చెందిన భానుప్రియ ఆమె పిల్లలుగా పోలీసులు గుర్తించారు. కాగా వేదాన్ష్ ఆనంద్(5) మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలతో అక్కడి నుంచి వచ్చి శామీర్ పేట చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.