Monday, October 7, 2024

Hyderabad – సీవ‌రేజీ మాస్ట‌ర్ ప్లాన్ ను అమృత్ 2.0లో చేర్చండి – కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌కు సిఎం వినతి

ఢిల్లీ: హైద‌రాబాద్ స‌మ‌గ్ర సీవ‌రేజీ మాస్ట‌ర్ ప్లాన్ ను(సీఎస్ఎంపీ) అమృత్ 2.0లో చేర్చాల‌ని లేదా ప్ర‌త్యేక ప్రాజెక్టుగా చేప‌ట్టాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, గృహ‌నిర్మాణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం క‌లిశారు. చారిత్ర‌క హైద‌రాబాద్ న‌గ‌రంలో పురాత‌న మురుగుశుద్ధి వ్య‌వ‌స్థ‌నే ఉంద‌ని, అది ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా లేద‌ని కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు.

హైద‌రాబాద్ స‌మీప‌ పుర‌పాల‌క సంఘాల్లోనూ స‌రైన మురుగు నీటి పారుద‌ల వ్య‌వ‌స్థ లేద‌ని కేంద్ర మంత్రి దృష్టికి ఆయ‌న తీసుకెళ్లారు. హైద‌రాబాద్‌లో ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు ప్ర‌పంచ స్థాయి నగ‌రంలో మాదిరి ఉండాలంటే న‌గ‌రంతో పాటు స‌మీప మున్సిపాలిటీల్లో 100 శాతం ద్ర‌వ వ్య‌ర్థాల శుద్ధి చేయాల్సిన అవ‌సరం ఉంద‌ని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌కు వివ‌రించారు.

ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌తో పాటు స‌మీప 27 పుర‌పాల‌క సంఘాల‌తో క‌లుపుకొని క‌లిపి 7,444 కి.మీ.మేర రూ.17,212.69 కోట్ల‌తో సీఎస్ఎంపీకి డీపీఆర్ రూపొందించిన‌ట్లు ఖ‌ట్ట‌ర్‌కు సీఎం తెలిపారు. ఆ డీపీఆర్‌ను కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి అంద‌జేశారు.

- Advertisement -

సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక స‌హాయం చేయ‌డం లేదా ప్ర‌త్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 55 కి.మీ. మేర మూసీ న‌ది ప్ర‌వ‌హిస్తోంద‌ని, ఇరువైపులా క‌లిపి 110 కి.మీ.మేర న‌గ‌రంలోని మురుగు అంతా మూసీలోనే చేరుతోంద‌ని ఖ‌ట్ట‌ర్‌కు రేవంత్ తెలిపారు. ఇలా మురుగు మూసీలో చేర‌కుండా ఉండేందుకు ట్రంక్ సీవ‌ర్స్ మెయిన్స్‌, లార్జ్ సైజ్ బాక్స్ డ్రెయిన్స్, కొత్త సీవ‌రేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.4 వేల కోట్ల‌తో డీపీఆర్ రూపొందించిన‌ట్లు కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి తెలిపారు.

ఆ డీపీఆర్‌ను ఖ‌ట్ట‌ర్‌కు సీఎం స‌మ‌ర్పించారు. ఆ డీపీఆర్‌ను ఆమోదించ‌డంతో పాటు ప‌నుల‌ అనుమ‌తికి చొర‌వ చూపాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

హైద‌రాబాద్ మెట్రో రెండో ద‌శ విస్త‌ర‌ణ‌కు సంబంధించి నాగోల్-శంషాబాద్ రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం (36.8 కి.మీ.), రాయ‌దుర్గం-కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్‌-చాంద్రాయ‌ణ‌గుట్ట (7.5 కి.మీ.), మియాపూర్‌-ప‌టాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీ న‌గ‌ర్‌-హ‌య‌త్ న‌గ‌ర్ (7.1 కి.మీ.) మొత్తం 76.4 కి.మీ. మేర డీపీఆర్‌లు పూర్త‌యిన‌ట్లు కేంద్ర మంత్రి కి రేవంత్ తెలియ‌జేశారు.

ఈ కారిడార్ల నిర్మాణానికి రూ.24,269 వ్య‌యం అవుతుంద‌ని అంచనా వేశామ‌ని, దీనిని కేంద్రం, తెలంగాణ ప్ర‌భుత్వం 50:50 రేషియోలో జాయింట్ వెంచ‌ర్‌గా చేప‌ట్టాల‌ని భావిస్తున్న‌ట్లు సీఎం తెలిపారు. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను స‌మ‌ర్పిస్తామ‌ని.. అది త్వ‌ర‌గా కార్య‌రూపం దాల్చేందుకు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రి నీ కోరారు.

ముఖ్య‌మంత్రి వెంట న‌ల్గొండ‌, భువ‌న‌గిరి, పెద్ద‌ప‌ల్లి ఎంపీలు ర‌ఘువీర్ రెడ్డి, చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, జి.వంశీకృష్ణ‌, ఢిల్లీలో తెలంగాణ‌ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ఏపీ జితేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు శ్రీ‌నివాస‌రాజు, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, ముఖ్య‌మంత్రి ముఖ్య కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, రాష్ట్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి దాన కిశోర్‌, హైద‌రాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement