Friday, September 20, 2024

TG: రిజర్వాయర్లపై.. మంత్రి ఉత్తమ్‌కు హరీష్‌రావు లేఖ

హైదరాబాద్‌: మాజీ మంత్రి హరీష్ రావు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ (అంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లు పూర్తిగా నీళ్లు లేక రిజర్వాయర్‌లు అడుగంటి పోయే పరిస్థితికి చేరుకున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హరీశ్‌.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు.

”గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్‌లో 3.32 టీఎంసీల నీళ్ళు ఉంటే ప్రస్తుతం 0.75 టీఎంసీలు, రంగనాయక సాగర్‌లో 2.38 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.67 టీఎంసీలు, మల్లన్న సాగర్ 18 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.5 టీఎంసీలు, కొండ పోచమ్మ సాగర్ 10 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

.. పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడ తగ్గి పోయింది. కాబట్టి రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానెర్ నుండి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్‌లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నా. అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం పక్షాన కోరుతున్నాను” అని లేఖలో అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement