Friday, September 20, 2024

Harish Counter – మాట త‌ప్పిందెవ‌రు…రాజీనామా చేయాల్సిందేవ‌రు?

రుణమాఫీ పూర్తి కాలేదు
మాట తప్పిన సీఎం రేవంత్​
ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి
మంత్రులంతా తలో మాట చెబుతున్నారు
ఇంకా 54 శాతం రుణమాఫీ కావాలి
దేవుళ్లపై ఒట్టేసి మోసం చేయొద్దు
ప్రాయచ్చిత్తం చేసుకోండి
ప్రభుత్వానికి సూచించిన హరీశ్​రావు


ఆంధ్రప్రభ స్మార్ట్​, యాదాద్రి: రుణమాఫీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. రుణమాఫీ పేరుతో రైతులనే కాదు.. దేవుళ్లను కూడా సీఎం రేవంత్‌ రెడ్డి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణమాఫీ పూర్తయిందని ముఖ్యమంత్రి చెప్పారు. మంత్రులేమో తలో మాటా మాట్లాడుతున్నారని అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని గురువారం దర్శనం చేసుకున్న అనంతరం పార్టీ నాయకులతో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఇంకా 17 లక్షల మందికి మాఫీ చేయాల్సి ఉందని మంత్రి ఉత్తమ్‌ అన్నారన్నారు. రుణమాఫీ పూర్తికాలేదని పొంగులేటి అంటున్నారని చెప్పారు. రుణమాఫీకి మరో ₹12 వేల కోట్లు ఇంకా ఇవ్వాలని అంటున్నారని వెల్లడించారు.

- Advertisement -

మంత్రులది తలోమాట..

రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేయాలని మంత్రి తుమ్మల చెప్పారు. ఇప్పటివరకు 22 లక్షల మందికి రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశామన్నారు. తుమ్మల లెక్కల ప్రకారం 42 లక్షల మంది రైతులకుగాను 22 లక్షల మందికే మాఫీ అయ్యింది. అంటే ఇప్పటివరకు 45శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు. ఇంకా 54 శాతం మంది రైతులకు మాఫీ డబ్బు బ్యాంకుల్లో జమచేయాలి. మరి మంత్రుల లెక్కల ప్రకారం రాజీనామా ఎవరు చేయాలి అని హరీశ్​రావు ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డికి నీతి, నిజాయితీ ఉంటే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ప్రాయచ్చిత్తం చేసుకోండి..

ఏ దేవుళ్లపై ఒట్లు పెట్టారో ఆ దేవుళ్ల వద్దకు వెళ్లి రేవంత్‌ రెడ్డి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని హరీశ్​రావు అన్నారు. తాను తెలంగాణ కోసం మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. పాలకుడు పాపం చేస్తే ప్రజలకు అరిష్టం అని బ్రాహ్మణ ఉత్తములు చెప్పారు. అందుకే ప్రజలకు అరిష్టం కలుగకుండా పాపం చేసిన సీఎంను క్షమించాలని మొక్కుకున్నా. ప్రజలను రక్షించాలని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని వేడుకున్నాని చెప్పారు. రైతులందరికి రుణమాఫీ, పంటల బోనస్‌ ఇచ్చేంత వరకూ పోరాడే శక్తిని ఇవ్వాలని వేడుకున్నానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement