Thursday, October 17, 2024

Handloom Day – మనిషికి నాగరికతను అద్దిన నేత‌న్న నీకు శుభాకాంక్ష‌లు….

ఆంధ‌ప్ర‌భ స్మార్ట్ – హైదరాబాద్, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల పాటు దగాపడ్డ చేనేతరంగానికి బీఆర్ఎస్ పదేళ్ల ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ స్వర్ణయుగమన్నారు. నేత కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడు, మగ్గానికి మంచిరోజులు తెచ్చిన దార్శనికుడు, వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టిన పాలకుడు కేసీఆర్ అని అన్నారు. సమైక్యరాష్ట్రంలో ఆరేళ్ల బడ్జెట్ రూ.600 కోట్లే ఇచ్చారని.. కానీ బీఆర్ఎస్ పాలనలో ఏడాదికి రూ.1200 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

కేసీఆర్ హయాంలోనే నేతన్నలకు గుర్తింపు, గౌరవం లభించాయన్నారు. ఎన్నో విప్లవాత్మక పథకాలకు చిరునామా తెలంగాణ రాష్ట్రమన్నారు. దేశంలోనే తొలిసారి 50 శాతం సబ్సిడీతో ”చేనేత మిత్ర” నేతన్నకు చేయూత పేరుతో త్రిఫ్ట్ ప్రత్యేక పొదుపు పథకం తీసుకొచ్చామ్నారు. ”నేతన్నకు బీమా” పేరుతో 5 లక్షల రూపాయల ధీమా కల్పించామన్నారు. 36 వేల మంది నేతన్నల కుటుంబాలకు కొండంత అండగా నిలిచామన్నారు. 10,150 మంది చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రూ.29 కోట్ల రుణాల మాఫీ చేసినట్లు చెప్పుకొచ్చారు. చేనేత కళాకారులకు ఆసరా పెన్షన్‌తో ఆపన్న హస్తం అందించామన్నారు. పద్మశాలీల ఆత్మగౌరవం పెంచే చారిత్రక నిర్ణయాలనేకమని తెలిపారు. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని గట్టెక్కించిన యజ్ఞం చేపట్టామని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సిరిసిల్లలో అప్పరెల్ పార్క్ ఏర్పాటు ఓ సంకల్పమని.. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఓ సంచలనమని పేర్కొన్నారు.

- Advertisement -

బీఆర్ఎస్ హయాంలో చేనేత రంగంలో చిరునవ్వులని.. కానీ కాంగ్రెస్, బీజేపీ పాలనలో బతుకులు ఛిద్రమవుతున్న పరిస్థితి ఏర్పడింది. ”ఎన్డీయే హయాంలో తొలిసారి చేనేత వస్త్రాలపై జీఎస్టీ పన్ను.. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు… ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు రద్దు.. ఆల్ ఇండియా పవర్లూమ్ బోర్డు రద్దు.. చేనేత కార్మికుల త్రిప్ట్ పథకం రద్దు.. హౌస్ కం వర్క్ షెడ్ పథకాల రద్దు.. మహాత్మాగాంధీ బునకర్ బీమా పథకం రద్దు.. యార్న్ పై సబ్సిడీ 40% నుంచి 15 శాతానికి తగ్గింపు” చేశారన్నారు. అలాగే రేవంత్ పాలనలో చేనేత రంగం మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ప్రతినిత్యం చేనేత కార్మికుల కుటుంబాల్లో మరణమృదంగం మోగుతోందని తెలిపారు. ఇప్పటికైనా ఇరు ప్రభుత్వాలు కళ్లు తెరవాలని హితవుపలికారు. సంక్షోభం నుంచి చేనేత రంగాన్ని గట్టెక్కించాలని.. బీఆర్ఎస్ పాలనలో అమలైన పథకాలు కొనసాగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. .

”నరాలను పోగులుగా చేసి..
తమ రక్తాన్ని రంగులుగా వేసి..
గుండెలను కండెలుగా మార్చి..
చెమట చుక్కల్ని చీరలుగా మలచి..
పేగులను వస్త్రాలుగా అందించి..
మనిషికి నాగరికతను అద్దిన..
చేనేత కార్మికులందరికీ
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement