TG | ప్రైవేటీకరణ దిశగా విద్యుత్ రంగం.. అదానీకి అప్పగించనున్న ప్రభుత్వం

రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ పంపిణీ బాధ్యతలను పైలట్ ప్రాజెక్టుగా అదానీ గ్రూప్‌కు అప్పగించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

పాత బస్తీలో కరెంట్ బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదని, వసూలు చేసేందుకు వెళ్లే కరెంట్‌ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగుతున్నారని సీఎం ఢిల్లీలో విలేకరులతో అన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో, ఆపై రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ బాధ్యతను ఆదానికి అప్పగిస్తామని తెలిపారు. అదానీ గ్రూప్ ద్వారా వచ్చే ఆదాయంలో 75% రాష్ట్ర ప్రభుత్వానికి, మిగిలిన 25% అదానీ గ్రూప్‌కు వెళ్తుందని చెప్పారు. దీనిపై ఇప్పటికే అదానీ గ్రూప్‌తో చర్చించామని, వారు అంగీకరించారని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్టును సిద్ధం చేయాలని అదానీ గ్రూప్‌ను కోరినట్టు వెల్లడించారు.

Exit mobile version