చారిత్రక కట్టడాల పరిరక్షణకోసం తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని, చరిత్రలో నిలిచిపోయే విధంగా కట్టడాలను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్పేటలో నిజాం ప్రభుత్వ హయాంలో నిర్మించిన మెట్ల బావిని మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, సహిత స్వచ్ఛంద సంస్థ
నిర్వాహకురాలు కల్పనా రమేష్తో కలిసి పరిశీలించారు. ఎంతో పురాతనమైన మెట్ల బావి కోనేరు 30.5 మీటర్ల పొడవు, 19.2 ఫీట్ల వెడల్పు, 53 అడుగుల లోతు కలిగి ఉంది. ఈ బావి పూర్తిగా చెత్త, వ్యర్థాలతో పూడిపోగా 6 నెలల పాటు- శ్రమించి సహిత స్వచ్ఛంద సంస్థ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 2వేల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించడం జరిగింది. ఈ బావికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన
చర్యలను తెలుసుకునేందుకు బావిని పూర్తిస్థాయిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్
పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్లు తిరిగి పరిశీలించారు. బావిలోని చెత్త తొలగింపునకు ముందున్న పరిస్థితి, ప్రస్తుత పరిస్థితులను వివరించేలా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్కు చారిత్రక నగరంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, అనేక పురాతన కట్టడాలు ఈ నగరంలో ఉన్నాయని వివరించారు. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే పురాతన కట్టడాలను పరిరక్షించి వాటికి పూర్వవైభవం తీసుకురావాలని ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశించారని తెలిపారు. 17వ దశాబ్దంలో ఈ ప్రాంత ప్రజల అవసరాల కోసం బన్సీలాల్పేటలో ఈ మెట్ల బావిని నిర్మించినట్లు తెలిపారు. ఈ బావిని ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోవడం
జరుగుతుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. ఈ బావికి సంబంధించిన చరిత్ర ఇక్కడికి వచ్చే ప్రజలకు తెలిసేలా పూర్తి సమాచారాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామన్నారు.
స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్కుమార్ మాట్లాడుతూ నగరంలో ఉన్న పురాతన కట్టడాలను గుర్తించి వాటి పునరుద్ధరణ, పరిరక్షణకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి
కల్వకుంట్ల తారకరామారావు ఆదేశించారని తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే మోజం జాహి మార్కెట్ను అభివృద్ధి చేయడం జరిగిందని, త్వరలోనే మోండా మార్కెట్, మీరాలంమండి, సర్దార్మహల్ తదితర పురాతన నిర్మాణాలను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. నగరంలో ఇలాంటి బావులు 44వరకు ఉండగా, ఇప్పటికే బన్సీలాల్పేటతో సహా ఆరుబావుల పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగిందని, వీటిలో బాపూఘాట్, గచ్చిబౌలి, సీతారాంబాగ్, గుడిమల్కాపూర్, శివంబాగ్లు ఉన్నాయని చెప్పారు. మరో 20 బావుల పునరుద్ధరణ పనులను త్వరలోనే చేపట్టనున్నట్లు వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..